
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయనతో తనకున్న అనుబంధాన్ని, ఆయన్ని తొలిసారి కలిసిన సందర్భాన్ని సీనియర్ నటుడు చలపతిరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది, అప్పటి ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉండేది అనే విషయాలను చెప్పారు. తన చిన్నతనం నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తిని పెంచుకున్నానని చలపతి రావు అన్నారు. సుమారు 100కు పైగా నాటికలు, నాటకాలు ప్రదర్శించి, చదువును సైతం పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఎస్.ఎస్.ఎల్.సి, పి.యు.సి., బి.ఎస్.సి. వంటి దశలలో చదువును కొనసాగించలేకపోయానని, రిహార్సల్స్కు వెళ్లిపోవడం వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. 21-22 సంవత్సరాల వయసులో సినిమాల్లో అవకాశాల కోసం ‘సర్కార్ ఎక్స్ ప్రెస్’ ఎక్కి మద్రాసు చేరుకున్నానన్నారు.
మద్రాసులో అప్పటి ఇండస్ట్రీ పరిస్థితులు ఆశ్చర్యం కలిగించాయని చలపతి రావు వివరించారు. వాహిని స్టూడియో లాంటి చోట్ల గేటు వాచ్మెన్లు ఎవ్వరినీ లోపలికి రానిచ్చేవారు కాదని, ఎన్టీఆర్, జెమినీ గనేషన్, సావిత్రి లాంటి దిగ్గజాలు కార్లలో వెళ్తుంటే బయటి నుంచి చూడటమే తప్ప కలవడానికి అవకాశం ఉండేది కాదని గుర్తుచేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ని ఎలా కలవాలోనని ఆలోచించారట. ఎన్టీఆర్ డైలీ రొటీన్ తెలుసుకున్న తర్వాత చలపతి రావు ఆశ్చర్యపోయారట. ఎన్టీఆర్ ప్రతిరోజూ తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్రలేచేవారని, వ్యాయామం చేసి, మేకప్ వేసుకుని, ఉదయం 4:30 గంటల కల్లా భోజనం చేసేవారని చెప్పారు. ఉదయం 5:00 గంటలకు తన బజూల్లా రోడ్ హౌస్లోని గదిలో కూర్చునేవారని, ఆ సమయంలో ఐదు వందల నుంచి ఆరు వందల మంది టూరిస్టులు, ఫ్యాన్స్ బస్సుల్లో వచ్చి ఆయనను చూసేవారని తెలిపారు. వారు ఎన్టీఆర్ పాదాలకు దండం పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, హారతి ఇచ్చేవారట వారితో ఎన్టీఆర్ మాట్లాడి వారి ఊరు, ప్రయాణం గురించి అడిగేవారని వివరించారు.
చలపతి రావు కూడా పర్యాటకులలో ఒకరిగా ఎన్టీఆర్ను కలిశారట. అయితే, అందరూ వెళ్లిపోయినా ఆయన అక్కడే నిలబడిపోవడంతో ఎన్టీఆర్ గమనించి పిలిపించారు. తాను సినిమాల్లో వేషాల కోసం వచ్చానని చెప్పగా, రామారావు చదువుకోమని సలహా ఇచ్చి పంపించేశారు. కానీ చలపతి రావు పట్టుదల విడవకుండా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో వెళ్లారు. ఈసారి ఎన్టీఆర్ ఆయన మొండితనాన్ని గుర్తించి, అప్పుడు చిత్రీకరణ జరుగుతున్న కథానాయకుడు సినిమా దర్శకుడు హేమాంబరధరరావు, నిర్మాత గోపాలకృష్ణకు సిఫారసు చేశారట. ఈ విధంగా కథానాయకుడు చిత్రంలో ఎలక్షన్ ఆఫీసర్గా చలపతి రావు తొలిసారి వెండితెరపై కనిపించారు. తన స్టేజ్ అనుభవంతో పేజీల కొద్దీ డైలాగులను అనర్గళంగా చెప్పి ఎన్టీఆర్ నుంచి “శభాష్” అని ప్రశంసలు అందుకున్నారట చలపతిరావు. అన్నీ సింగిల్ టేకుల్లోనే పూర్తి చేయడంతో దర్శకుడికి, నిర్మాతకు ఆయన ప్రతిభ నచ్చింది. కెమెరామెన్ వి.ఎస్.ఆర్.స్వామి ప్రత్యేక క్లోజ్ షాట్లు తీయించారు. భవిష్యత్తులో ఆయన్ను హీరోగా చేయాలనే ఆలోచనతో ఉన్నారని తర్వాత తెలిసింది. మొదటి సినిమాకు 116 రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు, అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం అని చలపతి రావు పేర్కొన్నారు. ఒక నెల రోజులు డాన్స్ రిహార్సల్స్ కూడా చేశారని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి , పగలు పనిచేసేవారట. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత రెండు షిఫ్ట్ లు మాత్రమే కేటాయించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో సినిమాకు పనిచేసేవారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకే సినిమాకు పనిచేసేవారు.
ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాదే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..