
ప్రముఖ క్యామెరామెన్ చోటా కె. నాయుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, తొలిప్రేమ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన రెండు కీలక సంఘటనలు పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథాన్ని, నిస్వార్థ స్వభావాన్ని వెల్లడి చేశాయని ఆయన తెలిపారు. మొదటి సంఘటన కులుమనాలిలో జరిగిందని. తొలిప్రేమ సినిమాలోని ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో, హీరో హీరోయిన్లు కారులో వెళ్తున్నప్పుడు లారీ ఢీకొని కారు లోయలో పడే సన్నివేశాన్ని చిత్రీకరించాలని నిర్ణయించారు. ఈ సన్నివేశం కోసం డూప్స్ను ఉపయోగించారు. కారును కంట్రోల్ చేయడానికి ఏనుగులను కట్టే గొలుసులను ఉపయోగించాం, అవి షూట్ చేస్తున్న సమయంలో తెగిపోయాయి. డూప్స్తో ఉన్న కారు వేగంగా లోయలోకి దూసుకుపోయింది. అప్పుడు డైరెక్టర్ కరుణాకర్ తో పాటు చిత్ర బృందం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పవన్ కళ్యాణ్ మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోయలోకి దిగి, గాయపడిన వారిని రక్షించడానికి ప్రయత్నించారు. గ్రామస్థుల సహాయంతో వారిని బయటకు తీసుకువచ్చి, వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత, చోటా కె. నాయుడు, మిగతా చిత్ర బృందం తీవ్ర భయాందోళనలకు గురయ్యారట. గాయపడిన డూప్స్ మూడు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది, తర్వాత ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇక రెండవ సంఘటన నానక్ రామ్ గూడలో జరిగింది. తొలిప్రేమ షూటింగ్ సమయంలో, పక్కనే ఉన్న రోడ్డుపై ఒక వ్యక్తి స్కూటర్పై వెళ్తూ పవన్ కళ్యాణ్ను చూసి అదుపుతప్పి కిందపడ్డాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ క్రికెట్ సీన్ కోసం వైట్ డ్రస్ లో ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే, ఆయన షూటింగ్ను పక్కనపెట్టి, వంద మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వెళ్లి, గాయపడిన వ్యక్తిని పైకి లేపారు. అతనికి తల పగిలి రక్తం కారుతోంది. ఆ రక్తం పవన్ కళ్యాణ్ డ్రస్, ఒంటికి మొత్తం అంటేసింది. అయినా లెక్కచేయకుండా.. పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని వెంటనే బండిలో ఎక్కించి అపోలో ఆసుపత్రికి పంపించారు. ఆసమయంలో దురదృష్టవశాత్తు, ఆ వ్యక్తి రెండు మూడు రోజుల తర్వాత మరణించినప్పటికీ, పవన్ కళ్యాణ్ రియాక్షన్, ఇతరులకు సహాయం చేయాలనే తపన ప్రశంసనీయం. చోటా కె. నాయుడు తమ ప్రొఫెషన్ పట్ల తనకున్న అంకితభావాన్ని కూడా వివరించారు. రిస్కీ షాట్లు తీయడంలో తనకు భయం లేదని, కొత్తదనం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రతిరోజూ ఒక రిస్కేనని, ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయి చనిపోయినవారు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తాను పని చేస్తూనే చనిపోవాలని కోరుకుంటానని, ఇంట్లో పడుకుని జ్వరం వచ్చి చనిపోవడం తనకు ఇష్టం లేదని చోటా కె. నాయుడు స్పష్టం చేశారు. పని చేస్తూనే చివరి శ్వాస వరకు ఉత్సాహంగా ఉండాలి అని చోటకే నాయుడు చెప్పుకొచ్చారు.