
ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల పెద్ద కుమార్తె అయిన వనితా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1999లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సుశీల పాత్రలో ఆమె నటించారు. అప్పట్లో ఈ మూవీ ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. సుశీల పాత్ర ప్రేక్షకులకు చేరువయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత వనితా మరో మూవీలో కనిపించలేదు. దేవి తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వనితా.. కొద్ది రోజులుగా ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తున్నారు. తండ్రితో వివాదం.. పెళ్లిళ్లు.. బిగ్ బాస్ షో.. తోటి నటీమణులతో గొడవలతో నిత్యం వార్తలలో నిలిచింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత వనితా విజయ్ కుమార్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన మళ్లీ పెళ్ళి సినిమాలో నటించారు వనితా.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వనితా మాట్లాడుతూ తన తండ్రికి.. తనకు మధ్య ఉన్న వివాదం గురించి ప్రస్తావించారు. “సాధారణంగా ఏ అమ్మాయికైనా తండ్రినే హీరో. అలాంటిది మా ఫాదర్ మాత్రం నా పాలిట విలన్ అని చెప్పలేను.. కానీ ఆయన నా పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. మా ఫాదర్ కు నాకు ఆస్తి తాలూకు గొడవలు ఉన్నాయి.
ఆ విషయంలో ఆయన నన్ను పోలీసులతో ఇంట్లో నుంచి బయటకు గెంటించారు. ఆరోజు రాత్రి ఎక్కడికి వెళ్లాలనేది అర్థం కాలేదు. నడిరోడ్డుపై నిలబడిపోయాను. అప్పుడు ఉన్న ప్రభుత్వం వలన ఆ పని చేయగలిగారు.. కానీ ఇఫ్పుడు వాళ్లు అలా చేయలేరు. ఆ పరిస్థితుల్లో పిల్లలతో మైసూర్ వెళ్లిపోయి అక్కడ కొంతకాలం ఉన్నాను. నువ్వు ఇకపై ఎప్పటికీ తమిళనాడులో అడుగుపెట్టలేవు అని మా ఫాదర్ నాతో అన్నారు. అలాంటి ఇప్పుడు అక్కడే దర్జాగా బతుకుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.