
ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఎమర్జెన్సీ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే సమయంలో రాజకీయాల పరంగా ఎమర్జెన్సీ మూవీపై పలు వివాదాలు తలెత్తాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన సొంత డబ్బుతో రెస్టారెంట్ ఓపెన్ చేయడం తన చిన్ననాటి కల అని కంగనా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడీ కల సాకారమైంది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో ‘ది మౌంటైన్ స్టోరీ’ పేరుతో ఒక రెస్టారెంట్ ను ప్రారంభించింది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. అంతకు ముందు జనవరి 19న, ప్రసిద్ధ పండిట్ నితిన్ శర్మ ఈ కెఫెలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే శుక్రవారం రిబ్బన్ కటింగ్ లాంటి ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ గా రెస్టారెంట్ ను ప్రారంభించింది కంగనా. కస్టమర్లు రాగానే వారికిష్టమైన వంటకాలను వడ్డించారు. ఈ రెస్టారెంట్ లో వెజ్ థాలీ, నాన్-వెజ్ థాలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెజ్ థాలీ ధర రూ.680, నాన్ వెజ్ థాలీ ధర రూ.850 గా ఉంది.
రెస్టారెంట్లో అల్పాహారంగా స్టఫ్డ్ తందూరీ ఆలూ పరాఠా, ఆలూ పూరీ, పోహే, వడపావ్, పకోడా, భాజీ, స్ట్రీట్ స్టైల్ నూడుల్స్, టీ, కాఫీలు దొరుకుతాయి. ఇక పహారీ వెజ్ థాలీ విషయానికి వస్తే.. మూంగ్ దాల్ విత్ రైస్, మహ్ కీ దాల్, దమ్ మద్ర, కడ్డూ కా ఖట్టా, కధీ పకోడా, మటర్ పన్నీర్ తో పాటు రైస్, లచ్చా పరాఠా, బట్టర్ నాన్ ఉన్నాయి. వెజ్ థాలీ ధరు సుమారు 680 రూపాయలు. పహారీ నాన్ వెజ్లో పహారీ చికెన్, పహారీ వైల్డ్ మటన్తో పాటు రైస్, లచ్చా పరాఠా బట్టర్ నాన్, బదానా మిఠా ఉంటాయి. నాన్-వెజ్ థాలీ ధర రూ.850గా ఉంది.
కాగా తన రెస్టారెంట్ లో ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని నటి, ఎంపీ కంగనా రనౌత్ తెలిపింది. ‘ ఇటలీ నాకు ఇష్టమైన ప్రదేశం. నాకు చాలా దేశాలు తిరిగే అవకాశం వచ్చింది. నాకు అమెరికన్ బర్గర్లు అంటే చాలా ఇష్టం. అయితే, తన రెస్టారెంట్లో హిమాచలి వంటకాలకు ప్రాధాన్యత ఇస్తాను’ అని కంగనా పేర్కొంది. కొన్ని రోజుల క్రితం, కంగనా ఈ హోటల్ను ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకుంది. తన సొంత రెస్టారెంట్ తెరవడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి