71st National Film Awards: జాతీయ అవార్డు విజేతలకు ప్రైజ్‌మనీ.. ఒక్కొక్కరికి ఎంత రానుందంటే?

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో టాలీవుడ్‌ సత్తా చాటింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ సినీ అవార్డుల్లో టాలీవుడ్‌ మొత్తం ఏడు పురస్కారాలను గెల్చుకుంది. మరి వీరికి ఎలాంటి ప్రోత్సాహకాలు రానున్నాయో తెలుసుకుందాం రండి.

71st National Film Awards: జాతీయ అవార్డు విజేతలకు ప్రైజ్‌మనీ.. ఒక్కొక్కరికి ఎంత రానుందంటే?
71st National Film Awards

Updated on: Aug 03, 2025 | 12:49 PM

2023లో జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సెన్సార్‌ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు చలనచిత్రసీమకు వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 7 అవార్డులు వచ్చాయి. 2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమాన్‌ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ అండ్‌ కామిక్‌), బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ) విభాగంలో ఈ పురస్కారాలు దక్కాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు, యానిమేటర్‌ జెట్టి వెంకట్‌ కుమార్‌కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు రానుంది. జెట్టి వెంకట్‌ కుమార్‌.. వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో బేబీ రచయిత, డైరెక్టర్ సాయి రాజేశ్‌తో పాటు మరో తమిళ దర్శకుడికి జాతీయ అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. ఇక ఇదే బేబీ మూవీలో ప్రేమిస్తున్నా… పాటకు పీవీఎస్‌ఎన్‌ రోహిత్‌కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు ప్రదానం చేయనున్నారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్‌ బెస్ట్‌ లిరిక్‌ రైటర్‌గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఈ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ భగవంత్‌ కేసరి నిలిచింది. షైన్‌ స్క్రీన్స్‌ నిర్మాతలతో కలిసి దర్శకుడు అనిల్‌ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్‌మనీని పంచుకోనున్నాడు.

ఇవి కూడా చదవండి

సుకుమార్ కూతురికి ఎంత రావొచ్చంటే?

ఇక ‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకుమార్ కూతురు సుకృతి వేణికి ఉత్తమ బాలనటి పురస్కారం దక్కింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్‌మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.

జాతీయ అవార్డుపై సుకృతి వేణి రెస్పాన్స్ .. వీడియో..

ఇక ఉత్తమ నటుడిగా షారూఖ్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మాస్సే (12th ఫెయిల్‌) జాతీయ అవార్డులు అందుకోనున్నారు. రిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. ఇక ఉత్తమ నటిగా నిలిచిన రాణీ ముఖర్జీకి రెండు లక్షల నగదు అందనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి