రన్యా రావు స్మగ్లింగ్ కేసు.. ఆమె తండ్రి ఐపీఎస్ రామచంద్రరావు పాత్ర ఏంటి? CID విచారణకు ప్రభుత్వం ఆదేశం
రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమె సవతి తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు పాత్రపై కర్ణాటక ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. బెంగళూరు విమానాశ్రయంలోని ప్రోటోకాల్ ఉల్లంఘనపైనా దర్యాప్తు జరుగుతుంది. 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన రన్యా రావును మార్చి 3న అరెస్టు చేశారు. భద్రతా లోపాలపైనా దర్యాప్తు జరుగుతోంది.

రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆమె వెనుక ఒక మంత్రి ఉన్నారనే పుకార్లతో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె స్మగ్లింగ్కు ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం వెనుక ఆమె సవితి తండ్రి ఐపీఎస్ రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో ఐపీఎల్ రామచంద్రరావు పాత్ర ఏంటనే దానిపై కర్ణాటక ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవల బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు, బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ను ఉల్లంఘించడంలో ఆమె సవతి తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు పాత్ర ఉందనే ఆరోపణలతో ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. మార్చి 3న దుబాయ్ నుంచి 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. భద్రతా లోపాలు, పోలీసు సిబ్బంది ప్రమేయం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి రెండు వేర్వేరు దర్యాప్తులను ఆదేశించింది ప్రభుత్వం.
కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారిని విచారించడమే కాకుండా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) పోలీసు సిబ్బంది ప్రమేయాన్ని కూడా పరిశీలిస్తుంది. విమానాశ్రయంలో ప్రోటోకాల్ సౌకర్యాల దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి దర్యాప్తు అధికారిగా ఐఏఎస్, అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలో, విమానాశ్రయంలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేదా పెద్ద అధికారుల పాత్ర ఉందా అనే అనుమానం సీఐడీ అధికారులకు విచారణ బాధ్యతలను తాజాగా అప్పగించారు. సీఐడీ విచారణలో ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.