మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం రక్షణ. ఇప్పటివరకు ప్రేమ కథలు, నెగిటివ్ రోల్స్ సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్ మొదటి సారిగా ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు సినిమా చుట్టూ చాలానే కాంట్రవర్సీ జరిగింది. ఎప్పుడో పూర్తయిన సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నారని.. రెమ్యూనరేషన్ సైతం ఇవ్వకుండా ప్రమోషన్స్ కి రావాలని కోరుతున్నారంటూ పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చిత్ర బృందం సైతం పాయల్ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. ఇలా పలు వివాదాల మధ్య నలిగిన రక్షణ సినిమా ఎట్టకేలకు జూన్ 7 న థియేటర్లలో రిలీజైంది. అయితే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కథ కొత్తగా ఆకట్టుకునేలా ఉన్నా సినిమాను ఇంట్రెస్టింగ్గా మల్చడంలో దర్శకుడు తడబడ్డాడని రివ్యూలు వచ్చేశాయి. ఇలా థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన రక్షణ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రక్షణ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజైన 15 రోజులకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు టాక్. జూన్ 21 నుంచి రక్షణ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రణదీప్ ఠాకూర్ తెరకెక్కించిన బ్రహ్మముడి మానస్ విలన్ రోల్ లో మెప్పించడం గమనార్హం. అలాగే శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాలా, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు థియేటర్లలో కాకపోయినా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో వేచి చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.