OTT Platforms Ban: అశ్లీల కంటెంట్పై కేంద్రం కొరడా.. ఇక ఈ ఐదు ప్రధాన ఓటీటీ ప్లాట్ఫామ్స్ కనిపించవు
అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం 5 OTT ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2021 మరియు ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లు సామాజిక నిబంధనలను పాటించాలని ప్రభుత్వం బలమైన సందేశాన్ని పంపింది.

ఓటీటీలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ను స్ట్రీమింగ్ చేస్తోన్న ఐదు OTT ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఈ మేరకు ఈ ఐదు ప్లాట్ఫామ్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం మూడ్ఎక్స్ వీఐపీ, కోయల్ ప్లేప్రో, డిజి మూవీప్లెక్స్, ఫీల్, జుగ్ను అనే ఐదు OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించి ఈ కఠిన చర్యలు తీసుకున్నామని కేంద్రం నివేదించింది. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రజలు కొన్ని సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వెళుతున్నారు. ఇతర సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇతర షోల కోసం ఎక్కువగా ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. ఇదే క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ కంటెంట్ కు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు అశ్లీల కంటెంట్ను కలిగి ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిజిటల్ ప్లాట్ఫామ్లకు స్వేచ్ఛ ఉందని, కానీ అవి నియమాలు, సామాజిక నిబంధనలను కూడా పాటించాలని ప్రభుత్వం సూచించింది. బ్లాక్ చేసిన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ల వెబ్సైట్లు, యాప్లు ఇకపై ఇండియాలో కనిపించవని సంబంధిత అధికారులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 , అశ్లీలత నిరోధక చట్టం, 2000లోని సెక్షన్ 69A కింద ఈ నిర్ణయాలు అమలు చేశామని కేంద్రం పేర్కొంది. ఈ సెక్షన్ కింద, వివిధ కారణాల వల్ల ఆన్లైన్ కంటెంట్ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య డిజిటల్ రంగంలో కంటెంట్ నియంత్రణ గురించి బలమైన సందేశంగా భావిస్తున్నారు. ఇతర మీడియా సంస్థల మాదిరిగానే ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు కూడా తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఈ చర్య ద్వారా కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది.ఏదైనా ప్లాట్ఫామ్ నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్న సందేశం ఇచ్చినట్లయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




