తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’లో మళ్లీ లొల్లి మొదలైంది. ‘మా’ అధ్యక్షుడు నరేశ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్కు మధ్య కోల్డ్వార్డ్ జరుగుతోంది. అసోషియేషన్కు చెందిన ఫండ్ రైజింగ్ విషయంలో నరేశ్ నుంచి అస్సులు సహకారం అందడం లేదని రాజశేఖర్ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నరేశ్కు రాజశేఖర్ వర్గం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అందులో మా అధ్యక్ష పదవి నుంచి నరేశ్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే ఆరు నెలల క్రితం జరిగిన మా ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్పై నరేశ్ వర్గం గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడిగా నరేశ్, ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్ గెలిచారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం రోజు నరేశ్ మాట్లాడిన తీరుపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నరేశ్ ‘‘నేను, నేను అని కాకుండా.. మేమంతా’’ అని ప్రస్తావిస్తే బావుంటుందని అప్పట్లో బహిరంగంగానే రాజశేఖర్ కామెంట్లు చేశారు.
ఇక ఇప్పుడు ‘మా’లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫండ్ రైజింగ్ గురించి చర్చలు జరిపేందుకు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా నరేశ్ హాజరుకాలేదని రాజశేఖర్ వర్గం ఆరోపిస్తుంది. జనరల్ బాడీ కాలపరిమితి ఏడాదిన్నర మాత్రమే ఉండగా.. అందులో ఆరు నెలలు ఇప్పటికే గడిచిపోయింది. మిగిలి ఉన్న ఏడాది కాలంలో ఫండ్ రైజింగ్ కోసం ఏమీ చేయకపోతే కష్టమవుతుందని రాజశేఖర్ వర్గం అంటోంది.
మరోవైపు ఈ విషయం గురించి తనకేమీ తెలియదని నరేష్ అంటున్నారట. అసలు రాజశేఖర్ వర్గం మీటింగ్ పెట్టుకున్నట్టే తనకు తెలీదని నరేశ్ అన్నట్లు సమాచారం. మరి ఈ లొల్లికి ఎప్పుడు పుల్స్టాప్ పడుతుందో చూడాలి.