రానున్న అసెంబ్లీ ఎన్నికలు… కాకరేపుతున్న కార్యకర్తల మరణాలు… బీజేపీ, తృణమూల్ పరస్పర ఆరోపణలు…

బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఆ రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక పార్టీ కార్యకర్తలపై మరో పార్టీ కార్యకర్తలు దాడులకు సైతం దిగుతున్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలు... కాకరేపుతున్న కార్యకర్తల మరణాలు... బీజేపీ, తృణమూల్ పరస్పర ఆరోపణలు...
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2020 | 2:15 PM

బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఆ రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక పార్టీ కార్యకర్తలపై మరో పార్టీ కార్యకర్తలు దాడులకు సైతం దిగుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన వరుస సంఘటనలు అక్కడి రాజకీయ వేడిని, ప్రత్యర్థుల మధ్య పోరును తెలుపుతున్నాయి.

పరస్పర దాడులు….

కేంద్రంలోని మోడీ సర్కారుపై పశ్చిమ బెంగాల్ మమతా ముఖర్జీ గత కొంతకాలంగా పోరాడుతోంది. కేంద్రం అవలంభిస్తున్న విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తోంది. మోడీ పాలనను విమర్శిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోంది. నిధులను కేటాయించడం లేదని అంటోంది. అయితే, రెండు, మూడేళ్ల నుంచి పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు.

నడ్డా కాన్వాయ్‌పై దాడి….

మమతా‌కు పోటీగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ప్రణాళికను అమిత్ షా రెండేళ్ల క్రితమే మొదలుపెట్టాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో డిసెంబర్ నెలలో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. దీంతో బెంగాల్ రాజకీయం మరింత వేడెక్కింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణలు, బదిలీలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి.

ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి….

సుఖ్‌దేవ్ ప్రమాణిక్, సాయికాత్ బన్వాల్ అనే భారతీయ జనతా పార్టీ కి చెందిన కార్యకర్తలు వేరు వేరు చోట్ల వేరు వేరు కారణాల వలన చనిపోయారు. అయితే ప్రమాణిక్‌ను టీఎంసీ కార్యకర్తలే కొట్టి చంపారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రమాణిక్ నడ్డా కాన్వాయ్‌పై దాడికి వ్యతిరేకంగా ఉద్యమించారని, అందుకే అతన్ని కొట్టి చంపారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. ప్రమాణిక్ మ‌ృతదేహాన్ని తరలించకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నాయి. అయితే పోలీసుల వాదన ప్రకారం ప్రమాణిక్ కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని అన్నారు. చనిపోయిన వ్యక్తి శవంపైనా ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. పోస్టుమార్టం కోసం శవాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పీటీఐ కథనం ప్రకారం….

బన్వాల్ అనే స్థానిక బీజేపీ బూత్ లెవల్ కమిటీ అధ్యక్షడని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపరిచారు. అతడు ఆ దెబ్బలకు చనిపోయాడు. దాడికి పాల్పడిన ముగ్గురిని పరగనాస్ పోలీసులు గుర్తించారు. కానీ వారు ఏ పార్టీ కార్యకర్తలనేది తెలుపలేదు. అయితే బారక్పూర్ ఎంపీ ‌అర్జున్ సింగ్ మాత్రం ఇది కచ్చితంగా టీఎంసీ కార్యకర్తల పనే అని ఆరోపించారు. కార్యకర్తల మృతికి సంతాపంగా బీజేపీ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీసింది. సీనియర్ బీజేపీ నేత ముకుల్ రాయ్ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే….

అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తిరిగి పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ నేతలు సైతం బెంగాల్ ‌లో పర్యటిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. బీజేపీ మమతాపై ఆరోపణలు చేస్తుంటే… మమతా బెనర్జీ బీజేపీ హత్యా రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తోంది. కాగా, బెంగాల్‌లో రాజకీయం వేడెక్కింది. నాయకుల విమర్శలు, కార్యకర్తల పరస్పర దాడులతో ఎన్నికల ముందే బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది.