
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఎస్సీ బాలికల వసతి గృహంలో విషాదం చోటుచేసుకుంది. పదోవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. చనిపోవడానికి ముందు ఇద్దరు విద్యార్థునులు రాసిన సూసైడ్ లెటర్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
భువనగిరిలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో వైష్ణవి, భవ్య పదోతరగతి చదువుతున్నారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన బాలికలు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. రోజూ మాదిరిగానే స్కూల్ కు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్ కు వచ్చి ట్యూషన్కు హాజరు కాలేదు. రాత్రి భోజనానికి కూడా రాకపోవడంతో అనుమానంతో హాస్టల్ వార్డెన్ వారి కోసం ఓ విద్యార్థిని పంపించారు. రూమ్ వద్దకు వెళ్ళిన వారికి అక్కడ కనిపించిన దృశ్యంతో షాక్ అయ్యారు. అప్పటికే హాస్టల్ గదిలో రెండు ఫ్యాన్లకు వైష్ణవి, భవ్య విగతా జీవులై వేలాడుతూ కనిపించారు. ఇద్దరు విద్యార్థినిలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోవడానికి ముందు ఇద్దరు విద్యార్థునులు సూసైడ్ లెటర్ రాశారు. ఇంతకీ అందులో ఏముందంటే.. ‘మేం వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్పా, ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అని ఆ లేఖలో రాసి ఉంది. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్ను అదుపులోకి తీసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. వసతి గృహంలో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వైష్ణవి, భవ్య మూడవ తరగతి నుండి ఇదే హాస్టల్ ఉంటూ చదువుకుంటున్నారు. పిల్లల ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చంపారంటూ హాస్టల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బాలికల ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..