
2000 కోట్ల డ్రగ్ రాకెట్లో తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ను ఢిల్లీ నార్కోటిక్ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ పోలీసుల విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జాఫర్ సాదిక్ కేంద్రంగా మూడు సంవత్సరాల నుండి భారీ డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్టు గుర్తించారు. మూడు సంవత్సరాల్లో సుమారు 3000 కేజీలకు పైగా డ్రగ్స్ను ఇతర దేశాలకు సరఫరా చేసినట్టు దర్యాప్తులో బయటపడింది.
మొత్తం 45 కన్సైన్మెంట్ల ద్వారా గడిచిన మూడు సంవత్సరాల్లో వివిధ దేశాలకు సూడో ఎపిడ్రిన్ అనే డ్రగ్ను ఎగుమతి చేసినట్టుగా గుర్తించారు. డ్రగ్ రాకెట్లో వచ్చిన డబ్బులను సినిమా ఇండస్ట్రీతో పాటు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టాడు. డ్రగ్ రాకెట్ ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు నార్కోటిక్ అధికారుల ముందు సాధిక్ ఒప్పుకున్నాడు. కొద్దిరోజుల ముందు డ్రగ్స్ను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్న కెమికల్స్ను ముగ్గురు వ్యక్తుల నుండి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫిక్ నెట్వర్క్ను ఛేదించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ కోసం గత రెండు వారాలుగా ఢిల్లీ బృందాలు వెతుకుతున్నాయి. ఈ ముగ్గురి నుండి 50 కేజీల సుడో ఎపిడ్రిన్ డ్రగ్ను పోలీసులు సీజ్ చేశారు.
వీరి నుండి పట్టుబడ్డ మత్తు పదార్థాలను ఇతర దేశాలకు తరలించేందుకు రెండు మార్గాలను ఎంచుకున్నట్టు అధికారుల దర్యాప్తులో బయటపడింది. సముద్రంతో పాటు వాయు మార్గాలను వీరు ఎంచుకున్నారు. కార్గో పార్సెల్ ద్వారా ఇతర దేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. హెల్త్ ప్రోడక్ట్స్ పేరుతో పార్సెల్ పంపించి అందులో ఉన్న పదార్థాలతో డ్రగ్స్ పౌడర్ను మిక్స్ చేసి పంపుతున్నారు.
న్యూజిలాండ్తో పాటు ఆస్ట్రేలియా పోలీసులు ఆ దేశాల్లో డ్రగ్స్ పట్టుబడుతుండడంతో వాటి మూలాలను కనుగొన్నారు. అక్కడ కస్టమ్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా భారత్లో మూలాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ డ్రగ్ ముఠాతో సంబంధాలు కలిగిన తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఇతర దేశాలకు సూడో ఎపిడ్రిన్ అనే మత్తు పదార్థాన్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నాడు. ఇతర దేశాలకు వీటిని తీసుకెల్లాక అక్కడ దర్యాప్తు సంస్థలు వీటి మూలాలను గుర్తించి భారత్కు సమాచారం చేరవేశారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్పై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నరు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..