“ఆన్లైన్ గేమ్’ రాకాసికి మరో బాలుడు బలి
మొన్న చిత్తూరు జిల్లా, నిన్న తెలంగాణలోని మంచిర్యాల..నేడు నెల్లూరు జిల్లాలోనూ ఆన్లైన్ గేమ్స్ కారణంగా మరో విద్యార్థి బలైపోయాడు. గంటల తరబడి సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ..

మొన్న చిత్తూరు జిల్లా, నిన్న తెలంగాణలోని మంచిర్యాల..నేడు నెల్లూరు జిల్లాలోనూ ఆన్లైన్ గేమ్స్ కారణంగా మరో విద్యార్థి బలైపోయాడు. గంటల తరబడి సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ..చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు విద్యార్థులు. తల్లిదండ్రులు మందలించారనే చిన్నచిన్న కారణాలకే మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నెల్లూరు విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్ వాడొద్దన్నందుకు బాలుడు ప్రాణం తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లగా..
నెల్లూరు జిల్లాలోని పెద్దచెరుకూరు గ్రామానికి చెందిన దంపతుల కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇటీవల స్కూల్ లేకపోవడంతో రోజంతా సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. అలా స్మార్ట్ ఫోనుకు బాగా అలవాటు పడిన విద్యార్థి నిత్యం అదే పనిగా దాన్నే చూస్తుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున కూడా ఫోన్ కావాలని తల్లిని అడిగాడు. అందుకు ఆమె బాలుడ్ని మందలించింది. ఫోన్ ఇవ్వకుండా చదువుకోమని చెప్పి పనిమీద బయటకు వెళ్లింది. అమ్మ ఫోన్ ఇవ్వలేదని మనస్తాపం చెందిన బాలుడు చీరతో రేకులకు ఉన్న ఇనుప గొట్టానికి ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి కుమారుడ్ని పిలవగా సమాధానం రాలేదు. కిటికీ నుంచి లోపలికి తొంగి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి అతన్ని కిందకు దించారు. హుటాహుటినా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొడుకు మృతితో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరోనా కారణంగా విద్యాసంస్థలన్నీ బంద్ అయ్యాయి. స్కూల్స్, కాలేజీలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు. మరికొందరు టీవీలు, సెల్ ఫోన్లతో టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఓ బాలుడు సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సెల్ఫోన్లకు బానిసలుగా మారకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.
