
విశాఖపట్నం జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు నిందుతున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధిత బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. పూర్తి వివరాలు పరిశీలించగా…
విశాఖ మన్యం హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ గొందివలసకి చెందిన గెడ్డంగి కొండబాబు అనే 60 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. అతని ఇంటి పక్కనే ఉండే నాలుగేళ్ల చిన్నారిని మిఠాయి కొనిస్తానని నమ్మించి శుక్రవారం బయటకు తీసుకెళ్లాడు. ఇంటి వెనుకాలే ఉండే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బాలిక ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అటువైపునకు వెళ్లి చూడగా రక్తస్రావంతో కూతురు కనిపించింది. విషయం అర్ధం చేసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాదింది. స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి కామాంధుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మనవరాలి వరసైన చిన్నారిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మనిషిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.