Drugs Case: అఫ్ఘాన్ టూ ఆంధ్రా వయా ఇరాన్, గుజరాత్.. అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో తెలుగు లింక్

కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆఐ) బయటపెట్టిన భారీ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మరో దర్యాప్తు సంస్థ(ఈడీ) రంగంలోకి దిగింది.

Drugs Case: అఫ్ఘాన్ టూ ఆంధ్రా వయా ఇరాన్, గుజరాత్.. అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో తెలుగు లింక్
Drugs
Follow us

|

Updated on: Sep 23, 2021 | 2:39 PM

కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆఐ) బయటపెట్టిన భారీ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మరో దర్యాప్తు సంస్థ(ఈడీ) రంగంలోకి దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో రూ. 21 వేల కోట్ల విలువ చేసే ఈ డ్రగ్స్ రాకెట్ తీగను పట్టుకున్న డీఆర్ఐ, ఈడీ సహాయంతో మొత్తం డొంకను కదిల్చే ప్రయత్నం చేస్తోంది. అఫ్ఘానిస్తాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు లింకులు కనిపిస్తున్న ఈ భారీ డ్రగ్స్ దందాలో ఇప్పటికే 8 మందిని డీఆర్ఐ అరెస్టు చేసింది. మొత్తం కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. తాలిబన్ల రాజ్యం అఫ్ఘానిస్తాన్‌లో కాంధర్ నుంచి 2 కంటైనర్లు రోడ్డు మార్గంలో బయల్దేరాయి. అవి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా సముద్రమార్గంలో ఈ నెల 13న గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్నాయి. కంటైనర్లలో ఉన్న సరుకును రికార్డుల్లో మాత్రం సెమీ ప్రాసెస్డ్ టాల్కం స్టోన్స్ గా పేర్కొన్నారు. బస్తాల్లో ఉన్న ఆ సరుకు తెరిచి చూసినా, పైన టాల్కం రాళ్లు మాత్రమే కనిపించేలా ప్యాకింగ్ చేశారు. అఫ్ఘానిస్తాన్ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకునే వస్తువే కావడంతో సాధారణంగా ఎవరికీ అనుమానం రాదు. కానీ, అసలే ఆ దేశం తాలిబన్ల వశమైంది. గతంలో మాదిరి మిత్రదేశంగా విశ్వసించలేని పరిస్థితి. దీంతో అధికారులు మరింత లోతుగా, నిశితంగా పరిశీలించారు. బస్తాల్లో రాళ్ల కింద పొడి రూపంలో పదార్థాన్ని గమనించారు. అది చూడ్డానికి టాల్కం పౌడర్ మాదిరి కనిపించడం లేదు. అంతే.. అనుమానం కలిగిందే తడవుగా ఆ పొడిని బయటికి తీసి, రసాయన పరీక్షలు నిర్వహించారు. అంతే.. అది ‘హెరాయిన్’ రకం నిషేధిత నార్కొటిక్ డ్రగ్ అని తేలిపోయింది. వెంటనే కంటైనర్లలో వచ్చిన సరుకునంతా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం లెక్కిస్తే 2,988.21 కేజీలుగా తేలింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే మొత్తం విలువ రూ. 21,000 కోట్లకు పైగానే ఉంటుందని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తేల్చారు.

దేశవ్యాప్తంగా దాడులు ముంద్రా పోర్టులో దొరికిన భారీ డ్రగ్స్ కంటైనర్లతో అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు, ఆ కన్‌సైన్మెంట్‌ను దిగుమతి చేసుకుంటున్న సంస్థను ఆషి ట్రేడింగ్ కంపెనీగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టర్డ్ కార్యాలయం కలిగిన ఆషి ట్రేడింగ్ కంపెనీ, చెన్నై నగరం నుంచి కార్యాకలాపాలు సాగిస్తోందని గుర్తించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు మూడ్రోజుల పాటు దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు నోయిడా(ఉత్తర్ ప్రదేశ్), చెన్నై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, మాండ్వి, గాంధీధామ్, విజయవాడ నగరాల్లో డీఆర్ఐ అధికారులు దాడులు, సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లీలోని ఓ గోడౌన్‌లో 16.1 కేజీల హెరాయిన్, నోయిడాలోని ఓ నివాస ప్రాంతంలో 10.2 కేజీల కొకైన్, 11 కేజీల హెరాయిన్ స్వాధీనం గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మొత్తమ్మీద నలుగురు అఫ్ఘాన్ జాతీయులు, ఒక ఉబ్జెక్ జాతీయుడు సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన లైసెన్స్ కోడ్ ఉన్నట్టు గుర్తించారు.

ఆంధ్రా లింకులు – ఈడీ అడుగులు ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా ఆంధ్రాలో తేలగా, ఆ కంపెనీ యాజమాన్య ఎం. సుధాకర్, జి. దుర్గా పూర్ణ వైశాలిని చెన్నైలో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. వారిని గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి తరలించి భుజ్ పట్టణంలోని న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితులను తమకు 10 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించింది. ప్రస్తుతం కస్టడీలో నిందితుల్ని డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ దందాలో భాగస్వాములైన మిగతావారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ దందాలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రారంభించింది.

మాదకద్రవ్యాల ఎగుమతుల ద్వారా వచ్చే డబ్బుతో అక్కడి తాలిబన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు మారణాయుధాలు కొనుగోలు చేస్తుంటాయి. ఇదంతా టెర్రర్ ఫండింగ్ నెట్‌వర్క్‌లో భాగం. ఇప్పుడు తాజాగా బయటపడ్డ డ్రగ్స్ వెనకాల ఉన్న ఉగ్రవాద సంస్థతో పాటు వారికి నిధులు అందజేసి మాదకద్రవ్యాలను భారత్‌కు తెప్పిస్తున్న బడాబాబుల గురించి ఈడీ ఆరా తీస్తోంది. నగదు లావాదేవీలు ఏరూపంలో జరిగాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆషి ట్రేడింగ్ కంపెనీ రికార్డుల్లో ఏం చూపింది? లావాదేవీలు ఎలా నిర్వహిస్తోంది? డబ్బులు ఎలా చేతులు మారాయి? వేల కేజీల్లో వచ్చిపడ్డ మాదకద్రవ్యాలు దేశంలో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? చిట్టచివరగా ఎవరి వరకు చేరుతున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేపనిలో డీఆర్ఐతో పాటు ఈడీ కూడా నిమగ్నమైంది.

– మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో

Also Read..

KTR Tweet: బుడ్డోడి ఆత్మ విశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా.. వీడియో ట్వీట్ చేస్తూ ప్రశంసలు..

Viral Video: పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసిన కోతి.. మూడు రోజులు పాటు తన చెరలో ఉంచుకుని ఆ తరువాత..