AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అన్నదమ్ముళ్ళ మధ్య అజ్యం పోసిన ఇంటి నిర్మాణం.. చివరికి ప్రాణమే పోయింది..!

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. పేగు తెంచుకుని పుట్టి తోడు నీడగా ఉండాల్సిన అన్నదమ్ములు... ఆస్తుల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఆస్తికోసం తమ్ముడు ఏం చేశాడంటే.. కత్తిపీటతో దాడి చేసి, ఆపై బండరాయితో మోది అన్నను దారుణంగా హత్య చేశాడు.

Telangana: అన్నదమ్ముళ్ళ మధ్య అజ్యం పోసిన ఇంటి నిర్మాణం.. చివరికి ప్రాణమే పోయింది..!
Crime
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 27, 2024 | 12:40 PM

Share

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. పేగు తెంచుకుని పుట్టి తోడు నీడగా ఉండాల్సిన అన్నదమ్ములు… ఆస్తుల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఆస్తికోసం తమ్ముడు ఏం చేశాడంటే.. కత్తిపీటతో దాడి చేసి, ఆపై బండరాయితో మోది అన్నను దారుణంగా హత్య చేశాడు.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం చెందిన చర్లపల్లి పద్మ, వెంకన్న దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరికి గ్రామంలో రెండు ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వెంకన్న అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందాడు. కుమారులు రాంబాబు(30), నవీన్‌లతో కలిసి తల్లి పద్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. అన్నదమ్ముళ్లకు వివాహాలు కాలేదు. కుటుంబ అవసరాల కోసం చేసిన రూ.20 లక్షల అప్పును తీర్చేందుకు తల్లి పద్మ 30గుంటల భూమి విక్రయించింది. భూమి విక్రయంతో వచ్చిన రూ.26 లక్షలతో అప్పు తీర్చింది. మిగిలిన 6లక్షల రూపాయల్లో తల్లి పద్మ రూ.2లక్షలు, రాంబాబుకు రూ.2లక్షలు, నవీన్‌కు రూ. 2 లక్షల ఇచ్చింది.

దీంతో పెద్ద కొడుకు రాంబాబు ఇంటి వద్ద చిన్నపాటి మొబైల్ షాపు పెట్టుకున్నాడు. నవీన్ సైతం ఆటోను కొనుక్కుని నడిపిస్తున్నాడు. అయితే కొత్తగా ఇల్లు నిర్మించుకుందామని రాంబాబు 15రోజులుగా తల్లి పద్మ, తమ్ముడు నవీన్‌కు చెబుతున్నాడు. ఇప్పటికే డబ్బుల విషయంలో అన్నదమ్ముళ్ల మధ్య తరచూ జరుగుతున్న గొడవలకు ఇంటి నిర్మాణం మరింత అజ్యం పోసింది. ఇల్లు కట్టుకోవడానికి తాను ఒక్క పైసా కూడా ఇవ్వనని తల్లి, సోదరుడితో రోజూ గొడవ పెట్టుకుంటున్నాడు నవీన్. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సోదరుడు రాంబాబుపై తమ్ముడు నవీన్ కత్తిపీటతో అకస్మాత్తుగా దాడి చేశాడు. రాంబాబు కింద పడిపోగానే దగ్గరలో ఉన్న బండరాయిని తలపై వేయటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…