
నమ్మేవాళ్లుండాలే గానీ దస్ కా తీస్ లాజిక్తో దగా పర్వానికి కొదువా! మలేషియా కంపెనీ పేరిట తెలుగురాష్ట్రాల్లో జరుగుతోన్న భారీ మోసం తెరపైకి వచ్చింది. ఓ నిండు ప్రాణం బలైపోయాక లోగుట్టు బయటపడింది. రైట్ ట్రేనింగ్ కన్సల్టెన్సీ. మలేషియన్ బేస్డ్ థర్డ్ పార్టీ కంపెనీ. ఇందులో . కోట్లు పెట్టుపడితే . వందల కోట్లలో లాభం అంటూ అరచేతిలో రాబడి చూపించారు. నమ్మకమే పెట్టుబడి అంటూ చాలా మందిని ట్రాప్ చేశారు. విజయవాడకు చెందిన అడ్వకేట్ ఇందిరా , విజయలక్ష్మీ, గౌరీష్ స్కందకుమార్ మాటలు నమ్మి నర్సింగరావు అనే వ్యక్తి కోటిన్నర రూపాయిలు డిపాజిట్ చేశాడు. నెలలు గడుస్తున్నా రిటర్న్స్ రాకపోవడం..అసలు తిరిగి ఇవ్వకపోవడం..డబ్బు కట్టించిన వ్యక్తులు సరిగా స్పందించకపోవడం వెరసి..మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు నర్సింగ్రావు. అతని ఫోన్ చెక్ చేస్తే ఇందిరాకు, నర్సింగరావుకు మధ్యలో జరిగిన సంభాషణలు బయటపడ్డాయి
కోటిన్నర పెడితే లాభాలతో పాటు మలేషియన్ కంపెనీలో డైరెక్టర్ పొజిషిన్ ఇస్తామని చెప్పారు. కంపెనీ నేమ్తో డాక్యుమెంట్స్కు కూడా ఇచ్చారు. ఆరా తీస్తే అవన్నీ ఫేక్ అని తెలిసిందన్నారు నర్సింగరావు కుటుంబసభ్యులు. నర్సింగరావు తరహాలోనే ఈ ముఠా మరికొందర్ని ట్రాప్ చేసింది. వరంగల్లో ఉండే వినయ్ అనే వ్యక్తిని సైతం 4 కోట్ల రూపాయలు మోసం చేశారు. నర్సింగరావు మరణం తర్వాత.. వినయ్ లాంటి బాధితులు చాలా మంది బయటకు వస్తున్నారు.
నరసింగరావు చనిపోయాక కొడుకును కూడా వదల్లేదు ఇందిరా. మీ నాన్న డబ్బులు ఎక్కడికి పోలేదు. రేపోమాపో మీ డబ్బులు మీకొస్తున్నాయి అని మళ్లీ ట్రాప్ చేయడం మొదలెట్టారు. కేసు ఏం పెట్టకూడదు. 50 లక్షలు స్పాట్ పేమెంట్ చేస్తాం అని రాజీకి వచ్చారు. కానీ నర్సింగరావు అన్నదమ్ములు మాత్రం పోలీసులు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంకంత కదిలినట్టు.. ఈ స్కాం బయటపడింది.
వరంగల్ సీపీ ఆదేశాలతో ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విజయవాడకు చెందిన ఇందిరను ఏ1గా చేర్చారు. విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు , స్కందకుమార్పై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇందిరా, విజయలక్ష్మి, స్కందకుమార్.. వీళ్లు ఇంకెందర్ని మోసం చేశారు? వీళ్ల వెనుక ఎవరున్నారు? అన్ని కోణాల్లో కూపీలాగుతున్నారు పోలీసులు.
మరిన్ని క్రైం న్యూస్ కోసం