ప్లాస్మా దానానికి ముందుకు రావాలంటూ గవర్నర్ పిలుపు
తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని.. అదే తన లక్ష్యమని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని చెప్పారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో శనివారం..
తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని.. అదే తన లక్ష్యమని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని చెప్పారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో శనివారం ప్లాస్మా బ్లడ్ బ్యాంకును సందర్శించిన సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడారు.
రక్తదానంపై ప్రజల్లో ఒక సాధారణ అపోహలు ఉన్నట్లుగానే ప్లాస్మా దానంపైనా ఉంటాయని, కానీ అలాంటి భయాలు అవసరం లేదని, మరో రకంగా ఇలాంటి దానాలు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుడుతూ మరింత ఆరోగ్యవంతంగా ఉంటామని, ఒక వైద్యురాలిగా చెప్తున్నానని గవర్నర్ వివరించారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్లాస్మా డోనర్లు ఈఎస్ఐ ఆస్పత్రికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనార్ సంతోష్కు పుష్ప గుచ్ఛం ఇచ్చి గవర్నర్ అభినందించారు. తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని గవర్నర్ సూచించారు.