వేములవాడలో శ్రావణమాస వేడుకలు..ఆన్లైన్ బుకింగ్తో దర్శనాలు!
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో శ్రావణమాస వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణమాసంలో వేలల్లో భక్తులు ఉపవాస దీక్షలో ఉండి పరమశివుడిని దర్శించుకుంటారు. ఈ నెల 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో..

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో శ్రావణమాస వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణమాసంలో వేలల్లో భక్తులు ఉపవాస దీక్షలో ఉండి పరమశివుడిని దర్శించుకుంటారు. ఈ నెల 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతించాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. ఈ మేరకు గంటకు 300 మంది చొప్పున ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.30 వరకు దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం ఐటీ విభాగానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
ఇకపోతే, కరోనా విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులను పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.




