Corona Vaccine: వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. విదేశీ టీకాల అనుమతి ఇచ్చే యోచన..?

భారత్‌లో కోవిడ్‌–19 మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. మొత్తం పాజిటివ్‌ కేసుల విషయంలో బ్రెజిల్‌ను భారత్‌ అధిగమించింది. ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది.

Corona Vaccine: వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. విదేశీ టీకాల అనుమతి ఇచ్చే యోచన..?
India Covid Vaccine
Follow us

|

Updated on: Apr 13, 2021 | 3:48 PM

Corona Vaccine in India: భారత్‌లో కోవిడ్‌–19 మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. మొత్తం పాజిటివ్‌ కేసుల విషయంలో బ్రెజిల్‌ను భారత్‌ అధిగమించింది. ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా కొనసాగుతోంది. కరోనా వైరస్ ‌నివారణకు గాను ఒక వైపు టీకా ఉత్సవ్‌ పేరిట ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు సెకెండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ కోసం గంటల తరబడి నిరీక్షించిన వయోవృద్ధులు నిరాశతో వెనుతిరిగాల్సి వస్తోంది.

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.ఇందులో భాగంగా అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. భారత్‌లో ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అనుమతులు ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరికొద్ది రోజుల్లోనే మరిన్ని టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ప్రపంచ ఆరోగ్యసంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, బ్రిటన్‌ ఎంహెచ్‌ఆర్‌ఏ, పీఎండీఏ జపాన్‌ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే ఆయా దేశాల్లో పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. ఇలా ఆమోదం తెలిపిన వ్యాక్సిన్‌లకు భారత్‌లో అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్‌లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. విదేశాల్లో అనుమతి పొందిన టీకాలను భారత్‌లో అనుమతించే ముందు.. తొలుత 100మంది లబ్ధిదారులకు ఇచ్చి వాటి భద్రత ఫలితాలపై వారం పాటు విశ్లేషిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చురుకుగా సాగుతోంది. ఇప్పటి వరకు 10.85 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసింది కేంద్రం. మరోవైపు, కరోనా కేసులు పెరగుతున్న దృష్ట్యా కోవిడ్ టీకాలు వేసుకునేందుకు పెద్ద సంఖ్య జనం ముందుకొస్తుండటంతో టీకా కొరత ఏర్పడింది. వ్యాక్సిన్‌ కొరత ఉందని పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవిస్తున్నాయి. దీంతో దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచడంతో పాటు వివిధ దేశాల్లో అనుమతి పొందిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించాలని నిర్ణయింది. దీంతో టీకాల కొరతను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరికొన్ని నెలల్లోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్, జైడస్‌ క్యాడిలా, నోవావాక్స్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన (ముక్కు ద్వారా తీసుకునే) టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

విదేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలు భారత్‌లో అనుమతి పొందాలంటే ఇక్కడే రెండో, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇదివరకే స్పుత్నిక్‌-వి, నోవావాక్స్‌ టీకాల ప్రయోగాలు భారత్‌లో చేపట్టాయి. అయితే, ఇవి విదేశాల్లో అనుమతులు పొందినప్పటికీ వాటిని భారత్‌లో వినియోగించడంలో కొంత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో వీటి ప్రయోగాలు, ఫలితాల విశ్లేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

Read Also…  ‘కిసాన్ సమ్మాన్‌ నిధి’కి అర్హులు కాకపోయినా డబ్బులు తీసుకుంటున్నారా..! అయితే కఠిన చర్యలు తప్పవు.. తెలుసుకోండి..