మాస్కులు లేని వారికి తెలంగాణ పోలీస్ షాక్ !
మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని బ్లూకోల్ట్స్, పెట్రోకార్ గస్తీ సిబ్బంది ద్వారా గర్తించి
కరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మీద చావు దెబ్బ కొడుతోంది. ఇక కరోనా వ్యాప్తిపై ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక దీంతో లాక్డౌన్ నిబంధనలను కరోనా ప్రభావం బాగా ఉన్న ప్రాంతాలలో మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకపోయినా, మాస్క్లేకుండా రోడ్లపైకి వచ్చిన వారి పట్ల తెలంగాణ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. మాస్క్ లేదంటే వెయ్యి ఫైన్ తప్పదన్న పోలీసులు..ఇప్పుడు కేసులు కూడా తప్పవంటున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోడ్లపైకి వస్తే ఖచ్చితంగా మాస్కులు ధరించాలని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని బ్లూకోల్ట్స్, పెట్రోకార్ గస్తీ సిబ్బంది ద్వారా గర్తించి కేసులు పెడుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, సెక్షన్ 51(బి) కింద ఈ నెల 7 నుంచి నిన్నటి వరకు మాస్కులు పెట్టుకోని 4,719 మందిపై కేసులు పెట్టారు.