AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం మరో కీలక ప్రకటన: మారనున్న గ్రామాల రూపురేఖలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా విధానంలో దూసుకుపోతున్నారు. రాబోవు రోజుల్లో గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నట్లు తెలిపారు.

ఏపీ సీఎం మరో కీలక ప్రకటన: మారనున్న గ్రామాల రూపురేఖలు
Jyothi Gadda
|

Updated on: May 19, 2020 | 6:55 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా విధానంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగన్ తాజగా గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్‌ మాట్లాడుతూ…చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలపై శ్రద్ధ పెట్టామని, రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్నదే లక్ష్యంతో పేదలందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అర్హులైన 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా భూసేకరణకు సంబంధించిన పనులను మే 31లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారి కోసం మే 21 వరకు ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. మే 30 కల్లా వీటికి సంబంధించిన వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితాను జూన్‌ 7న ప్రకటించాలని ఆదేశించారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశామని, జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. ఒక జేసీ రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీ గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు.. మూడో జేసీ ఆసరా, వెల్ఫేర్‌ కార్యక్రమాల పనులను అప్పగించినట్లు సీఎం జగన్ వివరించారు.

రాబోవు రోజుల్లో గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే విలేజ్ క్లినిక్స్‌లో 24 గంటలు ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారని, ప్రజలు ప్రజా వైద్య సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40 వేల కోట్లు కేటాయించిందని సీఎం జగన్ చెప్పారు. వలస కూలీలందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. వారందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని కలెక్టర్లను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.