యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్.. లక్షల మందిలో కేవలం 2.4 శాతం మందికే ఛాన్స్! సెలక్షన్ లిస్ట్ చూశారా
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించగా, ఆగస్టు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారిక వెబ్సైట్లలో రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ను యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది..

హైదరాబాద్, జూన్ 16: దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026’ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సోమవారం రాత్రి ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన అధికారిక వెబ్సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ (PDF) ను విడుదల చేసింది. ప్రిలిమ్స్లో మొత్తం 13,343 మంది (సుమారు 2.4 శాతం) అభ్యర్థులు అర్హత సాధించినట్లు కమిషన్ వెల్లడించింది. 2025లో 1,087 ఖాళీలకు గాను 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కూడా పేర్లతో సహా యూపీఎస్సీ విడుదల చేసింది.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 సెలక్షన్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశ వ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 పరీక్షా కేంద్రాల్లో మే 24, 2026న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రికార్డు స్థాయిలో 8,19,372 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వీరిలో సుమారు 5.49 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ సర్వీసెస్లో 933 పోస్టులను, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) లో 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. యేటా పరీక్ష ముగిసిన 17 రోజులలోపే ఫలితాలను ప్రకటించే యూపీఎస్సీ.. ఈసారి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయింది. మొత్తం సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష 2026 ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే తుది ఫలితాలు ప్రకటించిన తర్వాతే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన మార్కులు, కట్-ఆఫ్ స్కోర్లు, తుది ఆన్సర్ కీలు విడుదల చేస్తామని కమిషన్ అభ్యర్థులకు తెలియజేసింది.
ఇక ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ రాసేందుకు అవకాశం ఉంటుంది. అర్హత సాధించిన వారు మెయిన్స్కు సిద్ధమవచ్చు. ప్రిలిమ్స్లో సాధించిన మార్కులు తుది ర్యాంకుల నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్ మార్కులు మాత్రమే కీలకం కాబట్టి అభ్యర్ధులు ముమ్మరంగా ప్రిపరేషన్ సాగించాలని యూపీఎస్సీ తెలిపింది. మెయిన్స్లోనూ అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇక ఈ దశలోనూ ప్రతిభకనబరిస్తే తుది ర్యాంకులు ప్రకటించి సర్వీస్ కేటాయిస్తారు. యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ ప్రకారం సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష 2026 ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది.




