హైదరాబాద్, జులై 11: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు వివిధ సోషల్మీడియా ప్లాట్ ఫాంలలో వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.ఈ రెండు సర్వీసుల పరీక్షలను కమిషన్ వాయిదా వేసినట్లు గత కొన్ని రోజులుగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో వెబ్నోట్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. గ్రూప్-2 పరీక్షలు నవంబర్ 17, 18న, గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 24, 25వ తేదీకి మారాయనేది సదరు నకిలీ వార్తల సారాశం. వీటిని టీజీపీఎస్సీ పేరిట కొందరి నకిలీ వెబ్నోట్ సృష్టించి పలు వాట్సప్ గ్రూపుల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కమిషన్ ఇలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఈ నకిలీ సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని’ కమిషన్ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారంగానే పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఇప్పటికే జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గుర్తించగా.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసి, పోస్టుల సంఖ్య పెంచాలని గతకొద్ది రోజులుగా నిరుద్యోగులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించగా.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్-2 పోస్టులను 2 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కి, తమకు అన్యాయం చేస్తుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులతో టీజీపీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ఈ పరీక్షలు వాయిదా పడగా.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది. ఆ షెడ్యూల్ ప్రకారంగానే యథాతథంగా పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.