10th Class Result Date2026: ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మరికాస్త ఆలస్యంగా పదో తరగతి ఫలితాలు.. కారణం ఇదే!
ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 కొనసాగుతున్నాయి. గతేడాదికి భిన్నంగా ఈసారి రాష్ట్రంలో షెడ్యూల్ రూపొందించడంతో దాదాపు నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. ఫలితంగా నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి..

హైదరాబాద్, ఏప్రిల్ 9: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 కొనసాగుతున్నాయి. గతేడాదికి భిన్నంగా ఈసారి షెడ్యూల్ రూపొందించడంతో దాదాపు నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. ఫలితంగా నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. గత నెల మార్చి 14వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభమవగా ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 2,676 కేంద్రాల్లో విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత మార్కులను ప్రాసెస్ చేసి సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. ఇదంతా పూర్తి చేయడానికి మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే మరో వారం నుంచి 10 రోజుల పాటు క్రోడీకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా చూస్తే మే 4 లేదా 5 లేదా 6 తేదీల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా విద్యాశాఖ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఏపీలోనూ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలోనే విడుదలకానున్నాయి. మూల్యాంకనం ప్రక్రియలో చోటుచేసుకున్న జాప్యం కారణంగా ఏపీలో ఫలితాలు ఆలస్యం కానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




