
హైదరాబాద్, జులై 27: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తూ సాంకేతిక విద్యామండలి నిర్ణయం తీసుకుంది. టీజీసీహెచ్ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అధ్యక్షతన, సాంకేతిక విద్యా కమిషనర్ మరియు టీజీఐసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన సమక్షంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ షెడ్యూల్ను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సౌకర్యార్థం 22 హెల్ప్లైన్ సెంటర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.
తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 31 నుంచి ప్రారంభం కానుంది. జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో ప్రాసెస్ ఫీజు చెల్లించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి 5 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఆగస్టు 3 నుంచి 8 మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 8న ఆప్షన్లు ఫ్రీజ్ కాగా, ఆగస్టు 11న లేదా అంతకంటే ముందు సీట్ల కేటాయింపు ప్రకటన వెలువడుతుంది. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి 14 మధ్య వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇక తుది విడత కౌన్సెలింగ్ ప్రాసెస్ ఆగస్టు 17న స్లాట్ బుకింగ్తో ప్రారంభమై, ఆగస్టు 18న సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆగస్టు 18-19 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. ఆగస్టు 22న లేదా అంతకంటే ముందు ఆఖరి విడత సీట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 22 నుంచి 24 వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి, ఆగస్టు 22 నుంచి 25 నాటికి కేటాయించిన కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ కళాశాలల స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఆగస్టు 24న అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.