
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు చేతుల మీదగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని బహీర్బాగ్లో ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో నెల రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నలక్షలాది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్లో మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్సైట్లోనూ విద్యార్ధులు తమ రోల్ నంబర్ను నమోదు చేసి ఒక్క క్లిక్తో మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 13తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 23వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను ఇంకాస్త ముందుగానే ముగించాలని భావించి ఏప్రిల్ 29న వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
ఇక పదో తరగతి ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్లతోపాటు వాట్సాప్లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్ ద్వారా మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్చేసి హాల్టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.