TG DSC Sports Quota: ఆ డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పునఃపరిశీలన.. విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణలో ఇటీవల ముగిసిన డీఎస్సీ నియామక ప్రక్రియ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. తాజాగా క్రీడా కోటాలో డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు మరోమారు ధ్రుపపత్రాల పరిశీలన జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు కారణం.. ఫేక్ సర్టిఫికెట్లు చూపి, కొందరు ఉద్యోగాలు పొందారని ఫిర్యాదులు రావడమే..

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణలో ఇటీవల డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తైన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీ 2024 క్రీడా కోటా కింద ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి విద్యాశాఖకు కొన్ని ఫిర్యాలు వచ్చాయి. దీంతో డీఎస్సీ స్పోర్ట్స్కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పున:పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన వారికి ధ్రువపత్రాలను నవంబర్ 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో పునఃపరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కొంతమంది అభ్యర్థులు ఫేక్సర్టిఫికెట్లు పెట్టి స్పోర్ట్స్కోటాలో ఎంపికైనట్లుగా ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా స్పోర్ట్స్ కోటా కింద మొత్తం డీఎస్సీ పోస్టుల్లో 2 శాతం కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో సుమారు 100 పోస్టులు ఈ కోటాకు కేటాయించారు. వాటి కోసం మొత్తం 393 మంది ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిశీలించి స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 33 మందికి క్రీడా కోటా కింద పాఠశాల విద్యాశాఖ అధికారులు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలు ఇచ్చారు. అయితే వీరిలో ఇద్దరు ముగ్గురి సర్టిఫికెట్లపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మొత్తం 393 మంది ధ్రువపత్రాలను మరోమారు స్వయంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ నిర్ణయంతో మొత్తం అభ్యర్థులు మరోసారి ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాల్లో పలు అవకతవకలు జరిగాయని నిత్యం వార్తలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు అర్హులను పక్కనపెట్టి అర్హతలేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడంతో.. కష్టపడి చదివిన తాము మాత్రం నష్టపోవాల్సి వస్తుందని పలువురు అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
UPSC IFS Mains అడ్మిట్కార్డులు విడుదల.. నవంబర్ 24 నుంచి పరీక్షలు
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఎఫ్ఎస్)-2024 మెయిన్స్ పరీక్షల అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి, అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలు నవంబర్ 24, 25, 26, 27, 28, 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. మొత్తం 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఉద్యోగాలను ఈ ప్రకటన కింద భర్తీ కానున్నాయి. మెయిన్ తర్వాత మెరిట్ జాబితా విడుదల చేసి, పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.




