
హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 మే 22 నుంచి ప్రారంభమైనాయి. ఈ పరీక్షలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి. మరోవైపు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్ ప్రవేశ పరీక్ష కూడా ఇదే నెలలో జరగనుంది. ఇంటర్ అర్హతతో రాసే ఈపరీక్షను కొందరు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా రాయనున్నారు. అయితే సరిగ్గా ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు రాసే తేదీలోనే డీఎల్ఈడీ పరీక్ష కూడా ఉండటంతో విద్యార్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంతో రెండింటికి హాజరయ్యే వారికి కొత్త చిక్కు వచ్చిపడింది. డీఈఈసెట్ ఎగ్జామ్ ఈ నెల 25న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
సరిగ్గా అదే రోజు మధ్యాహ్నం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గణితం పేపర్ 2బీ, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు ఉన్నాయి. ఇంటర్ ఫెయిలైన వారితోపాటు, ఇంప్రూవ్మెంట్ రాసే వారు కూడా ఈ పరీక్షలు రాస్తున్నారు. దీంతో ఈ రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంతో ఏదో ఒక పరీక్ష వదులుకోవల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఒక పరీక్షను వాయిదా వేయాలని విద్యార్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఐఐటీల్లో ప్రవేశానికి మే 18న కాన్పూర్ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లతోపాటు ఆన్సర్ కీ గురువారం (మే 22) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని కాన్పూర్ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 26లోపు ఫైనల్ కీ విడుదల చేసే వీలుంది. ఇక జూన్ 2న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 3 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.