
హైదరాబాద్, జులై 7: పరాయి వ్యక్తితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ ఇల్లాలు.. తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని మాయం చేసింది. ఆనక ఏమీ నటిస్తూ భర్త కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు కిలాడీ లేడీ.. ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక దర్యాప్తులో పోలీసులకు తాజాగా అసలు గుట్టు తెలిసొచ్చింది.
ఈ కేసు లోతైన దర్యాప్తులో భాగంగా పోలీసులు సదరు మహిళ కాల్ డేటా రికార్డులను (CDR), ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. అనంతరం ఆధారాలు దొరక్కుండా శవాన్ని వాహనంలో మహారాష్ట్ర సరిహద్దుల (బార్డర్) వరకు తరలించి.. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ మేరకు నిర్ధారించారు. దీంతో నిందితులైన సదరు కిలాడి లేడీ, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులు తెలిపిన ఆధారాల మేరకు మహారాష్ట్రలోని స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు.
కాగా నేటి సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు ప్రశ్నార్ధకంగా మారాయి. ముఖ్యంగా భార్యభర్తలకు చెందిన పలు ఘటనలు ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థను దిగజార్చుతున్నాయి. కొన్ని చోట్ల భర్తలే కట్టుకున్న భార్యలను అడ్డుతొలగిస్తుంటే.. మరికొన్ని చోట్ల పరాయి పరుషుల వ్యామోహంలో భార్యలు తమ భర్తలను అంతమొందిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో పెళ్లి అంటేనే యువతీ, యువకులు జడుసుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో జంటలు తమ జీవిత భాగస్వాములను చంపడానికి సుపారీలు ఇచ్చి మరీ హత్యలు చేయిస్తున్నారు. హత్యలకు రకరకాల ప్లాన్లు వేసి.. ఆనక పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు.