JEE Advanced 2026 Dress Code: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష.. పరీక్ష కేంద్రానికి ఇలా వెళ్లొద్దు! ఈ గైడ్లైన్స్ పాటించండి
దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష రేపే (మే 17) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. జేఈఈ అడ్వాన్స్డ్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్లో దాదాపు 2,50,182 మంది అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించినట్లు ఐఐటీ రూర్కీ వెల్లడించింది. అయితే వీరిలో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 45 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్ష రాయనున్నారు..

హైదరాబాద్, మే 16: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష 2 పేపర్లకు ఉంటుంది. రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయి. ఈ రెండు పేపర్లను అభ్యర్ధులు రాయవల్సి ఉంటుంది. విద్యార్థుల్లోని లోతైన సబ్జెక్ట్ నాలెడ్జ్, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
అభ్యర్ధులు తమతోపాటు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, 2 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పెన్నులు-పెన్సిల్ మాత్రమే అనుమతిస్తారు. ఎలక్ర్టిక్ గాడ్జెట్లు, జామిండ్రీ బాక్స్లు, ఎరైజర్లు, రైటింగ్ ప్యాడ్, గాగుల్స్, హ్యాంగ్ బ్యాగులు వంటి వాటిని అనుమతించరు. అలాగే ఎలాంటి లోహ ఆభరణాలను కూడా ధరించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లకూడదు. పెద్ద బటన్లు ఉన్న దుస్తులు ధరించకూడదు. చెప్పులు వంటి తెరచి ఉన్న పాదరక్షలు మాత్రమే ధరించాలి. పరీక్ష ఇంగ్లిష్, హిందీ రెండు మాద్యమాల్లో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అభ్యర్ధులు జాగ్రత్తగా ప్రశ్నలకు జవాబులు గుర్తించవల్సి ఉంటుంది.
గత ఏడాది అడ్వాన్స్డ్లో మొత్తం 54,378 మందికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. 2025-26లో దేశ వ్యాప్తంగా 18,160 ఐఐటీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి మరో 300 పెరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని ఐఐఎస్సీ కూడా జోసా కౌన్సెలింగ్లో చేరడంతో అదనంగా సీట్లు పెరిగాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. జూన్ 1 జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలవుతాయి. ఇక జూన్ 2వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్ మొదలవుతుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్
- మే 21న వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు అందుబాటులోకి
- మే 25న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల
- జూన్ 1న తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలు విడుదల
- జూన్ 2 నుంచి జులై 24 వరకు జోసా కౌన్సెలింగ్
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




