CA 2025 Exams Postponed: పాక్-భారత్ ఉద్రిక్తతలు.. సీఏ ఫైనల్ పరీక్షలు వాయిదా! కొత్త షెడ్యూల్ త్వరలో ప్రకటన
పహల్గాం ఉగ్రదాడితో యావత్ భారతావని ఆగ్రహంతో కన్నెర్ర చేసింది. ఇందుకు ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ భారత్ పై దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఇరుదేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దేశంలో భద్రత, ఉద్రిక్తతల నడుమ సీఏ ఫైనల్ పరీక్షలను వాయిదానడ్డాయి..

న్యూఢిల్లీ, మే 9: దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ (సీఏ) పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని ICAI పేర్కొంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తత, భద్రత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ icai.org. సందర్శించాలని సూచించింది.
కాగా షెడ్యూల్ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రూప్ 1 ఫైనల్ ఎగ్జామ్ 2, 4, 6 తేదీల్లో నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఊచకోతకు ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేశాయి.
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి సెక్టార్లలోని ప్రాంతాలలో మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఫిరంగిని ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపి 16 మందిని ఇండియన్ ఆర్మీ చంపింది. గురువారం రాత్రి జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లోని సైనిక స్థావరాలతో సహా వివిధ కీలక స్థావరాలను ధ్వంసం చేసేందకు పాకిస్తాన్ యత్నించగా.. ఆ ప్రయత్నాలను భారత్ డ్రోన్లు, క్షిపణులతో వేగంగా తిప్పికొట్టింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.