Inter Answer Sheets Evaluation 2025: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే?
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు గురువారం (మార్చి 20)తో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్ధులు ఇంటిబాట పట్టారు. మరోవైపు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది..

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు గురువారం (మార్చి 20)తో ముగిశాయి. ఇక ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఉండటంతో అవి మార్చి 22తో ముగియనున్నాయి. మొత్తం 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్ధులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు విద్యార్ధులతో కిక్కిరిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ సందడి చేశారు. చివరి రోజు పరీక్ష రాసి కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ, హల్చల్ చేశారు. కాగా మార్చి 5న ఇంటర్ పరీక్షలు ప్రారంభమవగా మార్చి 20వ తేదీతో ముగిశాయి. ఇక అక్కడక్కడ కొందరు విద్యార్ధులు కాఫీయింగ్కు ప్రయత్నించడంతో అధికారులు వారిని డీబార్ చేశారు. అంతకు మించి దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
తొలిసారిగా మూల్యాంకన కేంద్రాల్లో బయోమెట్రిక్ ..
మరోవైపు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం నుంచే ప్రారంభమైంది. జవాబుపత్రాల మూల్యాంకనం నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని నిర్ణయించింది. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లల్లో నిర్వహిస్తున్నారు.
మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి సెంటర్లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు. అలాగే ఇంటర్ బోర్డు బీఐఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో వేలిముద్రలు లేదా ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు చేయవచ్చు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం అనంతరం మరో పది రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెనువెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. అంటే ఏప్రిల్ మూడోవారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.