‘ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జవాబుపత్రాలకు సీల్ వేసి, భద్రపరచండి’.. హైకోర్టు కీలక ఆదేశాలు
APPSC Group 1 Answer sheets to AP High Court: ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ జవాబుపత్రాలను అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం (నవంబర్ 6) హైకోర్టుకు తెలిపారు..

అమరావతి, నవంబర్ 7: ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ జవాబుపత్రాలను అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం (నవంబర్ 6) హైకోర్టుకు తెలిపారు. మొత్తం 325 మంది అభ్యర్థుల జవాబుపత్రాలను 21 బాక్స్లలో భద్రపరచినట్లు తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ జవాబుపత్రాలను రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు అందజేయాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించించింది.
చేతితో దిద్దిన మాన్యువల్ మూల్యాంకన జవాబుపత్రాలు, డిజిటల్ మూల్యాంకన పత్రాల సీడీలకు సీల్ వేసి, భద్రరచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు సూచించారు. వీటికి 24 గంటల పోలీసు భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం నవంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల ఈ పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ సహా ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈక్రమంలో సందేహాల నివృతికి బుధవారం మరోమారు విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జవాబుపత్రాలను అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




