
అమరావతి, సెప్టెంబర్ 14: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ ప్రకటనపైనే చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ 2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. దీంతో మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను సోమవారం (సెప్టెంబర్ 15) విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ నియమక ప్రక్రియలో ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను వివిద దశల్లో పూర్తి చేశారు.
జూన్ 2 నుంచి జులై 2వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం మెరిట్ జాబితా విడుదల చేసింది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఇక తుది ఎంపిక జాబితాను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించడం కోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 15) తుది మెరిట్ జాబితాను విడుదల చేసి, సెప్టెంబర్ 19న నిర్వహిచే కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు.
మరోవైపు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి అభ్యర్థితోపాటు సహాయకులుగా మరొకరిని వెంటబెట్టుకుని విజయవాడలో వెలగపూడిలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి తీసుకెళ్లేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీరికి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు భోజనం, నిద్రించడానికి వసతి సౌకర్యాలను కల్పించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి డీఎస్సీకి ఎంపికైన 16 వేల మంది అభ్యర్థులతోపాటు, వారి సహాయకులు మొత్తం 32 వేల మంది హాజరుకానున్నారు. వీరితో పాటు కూటమి పార్టీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులతో కలిపి సుమారు లక్ష మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా 10 రోజులపాటు శిక్షణ ఇస్తారు. అయితే గతంలో డీఎస్సీ అభ్యర్ధులకు కౌన్సెలింగ్లోనే పాఠశాలలు కేటాయించేవారు. కానీ ఈసారి మాత్రం శిక్షణ అనంతరం పాఠశాలలు కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. దసరా సెలవుల అనంతరం పాఠశాలల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.