Constable Jobs 2025: ఎట్టకేలకు కానిస్టేబుల్ కొలువులకు మోక్షం.. ముహూర్తం ఫిక్స్!
రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు ఈ ఏడాది ఆగస్ట్లోనే విడుదలైనాయి. కానీ అప్పట్నుంచి కానిస్టేబుల్ కొలువులకు ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ మొదలవ్వలేదు. దీంతో ఎంపికైన అభ్యర్ధులు ఎప్పుడెప్పుడాని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల..

అమరావతి, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు ఈ ఏడాది ఆగస్ట్లోనే విడుదలైనాయి. కానీ అప్పట్నుంచి కానిస్టేబుల్ కొలువులకు ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ మొదలవ్వలేదు. దీంతో ఎంపికైన అభ్యర్ధులు ఎప్పుడెప్పుడాని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరికి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 4.59 లక్షల అభ్యర్ధులు హాజరయ్యారు. ఇందులో 91,507 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు 2024 డిసెంబర్లో నిర్వహించారు. ఇక ఇందులోనూ అర్హత సాధించిన 37,600 మంది అభ్యర్థులకు జూన్ 1, 2025న తుది రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి అనిత చేతుల మీదగా ఆగస్టు 1 విడుదల చేశారు. మొత్తం 6,015 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారిలో 5,551 మంది ‘ఫిట్ ఫర్ ట్రైనింగ్’ సర్టిఫికేట్ పొందారు.
అయితే కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు సెప్టెంబర్ 2025లోనే ట్రైనింగ్ ప్రారంభమవుతుందని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఇప్పటి వరకు పత్తాలేదు. దీనిపై తాజాగా ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 22 నుంచి శిక్షణ మొదలవుతుందని ప్రకటించింది. అంతకంటే ముందు డిసెంబరు 16న మంగళగిరి బెటాలియన్లోని పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులతో సహా ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు.
అనంతరం అభ్యర్థులంతా డిసెంబర్ 22వ తేదీ లోపు వారికి కేటాయించిన పీటీసీ, డీటీసీ, బీటీసీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్కడ 9 నెలల పాటు వారికి శిక్షణ ఉంటుంది. తొలి విడత నాలుగున్నర నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఇది పూర్తయ్యాక వారం రోజుల పాటు సెలవులు ఇస్తారు. తర్వాత రెండో విడత శిక్షణ మొదలవుతుంది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) ఏర్పాట్లు చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








