చీమలతో వ్యర్థాల శుద్ధికి సరికొత్త ప్రయోగం.. ప్రపంచ వేదికపై 18 ఏళ్ల తెలుగు విద్యార్ధిని సత్తా
ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) విడుదల చేసిన ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్-2024 ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆహార నష్టం, వృథా వల్ల ఏటా సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల భారం పడుతోంది. మనుషుల వినియోగం కోసం ఉత్పత్తి చేసే ఆహారంలో దాదాపు ఐదో వంతు ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతోంది. ఇది రోజుకు సుమారు 100 కోట్ల భోజనాలకు సమానమని నివేదిక పేర్కొంది..

ఆహారాన్ని వృథాగా పారేయడం ఆర్థిక సమస్య మాత్రమే కాదు.. పర్యావరణానికీ తీవ్ర నష్టం కలిగిస్తోంది. వ్యర్థ ఆహారం ల్యాండ్ఫిల్స్లోకి చేరినప్పుడు కుళ్లిపోయి మీథేన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది వాతావరణ మార్పులకు కారణమయ్యే ప్రధాన హరితగృహ వాయువుల్లో ఒకటి. ఈ సమస్యకు వినూత్న పరిష్కారం చూపేందుకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ప్లానోకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని అనన్య గులూర్ నాగేంద్ర ఓ ప్రయోగం చేసింది. ఆహార వ్యర్థాలను విచ్ఛిన్నం చేసేందుకు చీమలను ఉపయోగించే ప్రోటోటైప్ను ఆమె అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ఆమెను 2026 రెజెనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఫైనలిస్టుల జాబితాలో నిలిపింది.
ఆహార వ్యర్థాలను చీమలు ఎలా తగ్గిస్తాయి?
అనన్య తొలుత నాలుగు రకాల చీమలపై ప్రయోగాలు చేసింది. ఒక్కో చీమ రోజుకు ఎంత పరిమాణంలో ఆహార వ్యర్థాలను తినగలదో పరిశీలించింది. ఈ పరీక్షల్లో Camponotus castaneus జాతి చీమలు అత్యంత సమర్థంగా ఆహార వ్యర్థాలను వినియోగించినట్లు గుర్తించింది. అంతేకాదు.. పరీక్షించిన చీమల జాతుల్లో ఈ చీమలకే అత్యధిక మెటబాలిక్ రేట్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆహార వ్యర్థాల నిర్వహణకు తాను రూపొందించాలనుకున్న వ్యవస్థకు ఈ జాతి చీమలు అనువైనవని అనన్య భావించింది. ఆ తర్వాత ల్యాండ్ఫిల్స్కు వెళ్లే ఆహార వ్యర్థాలను చీమల ఆధారిత వ్యవస్థకు మళ్లిస్తే మీథేన్ ఉద్గారాలు ఎంతవరకు తగ్గించవచ్చో అంచనా వేసేందుకు అనన్య గణిత నమూనాను రూపొందించింది. అనంతరం ఆక్సిజన్ సమక్షంలో వ్యర్థాలు విచ్ఛిన్నమయ్యేలా చీమల ఆధారిత ఏరోబిక్ డైజెస్టర్ను రూపొందించింది. ఈ ప్రోటోటైప్పై నిర్వహించిన పరీక్షల్లో సుమారు 83 శాతం సామర్థ్యం సాధించినట్లు Society for Science పేర్కొంది. ఈ వ్యవస్థను భారీ స్థాయిలో నిర్మించాలంటే 50 వేల డాలర్లలోపు ఖర్చుతో ఏర్పాటు చేయవచ్చని అనన్య అంచనా వేసింది.
ఇంకా ప్రాథమిక దశలోనే ప్రయోగం
అయితే చీమల ఆధారిత వ్యర్థ నిర్వహణ వ్యవస్థ ప్రస్తుతం విద్యార్థి పరిశోధనకు సంబంధించిన ప్రారంభ దశ ప్రోటోటైప్ మాత్రమే. ఇది ఇప్పటికే ఉన్న ల్యాండ్ఫిల్ లేదా వాణిజ్య వ్యర్థ నిర్వహణ వ్యవస్థలను భర్తీ చేయగలదని ఇప్పుడే చెప్పలేం. వివిధ రకాల, పెద్ద మొత్తంలో ఆహార వ్యర్థాలపై ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరింతగా పరిశోధించాల్సి ఉంది. అలాగే చీమలు దీర్ఘకాలం సమర్థంగా పనిచేయగలవా? భారీ స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యమేనా? అనే అంశాలపై కూడా మరిన్ని అధ్యయనాలు అవసరం. అనన్యను 2026 రెజెనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఫైనలిస్టుగా ఎంపిక చేశారు. విద్యార్థుల పరిశోధనల్లోని సృజనాత్మకత, కొత్త ఆలోచనలు, శాస్త్రీయ ప్రతిభ, నాయకత్వ లక్షణాలను గుర్తించే ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా దీనికి గుర్తింపు ఉంది. 2026 ఫైనలిస్టుల జాబితాలో 15 రాష్ట్రాల్లోని 35 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. మొత్తం 2,612 మంది దరఖాస్తుదారుల్లో నుంచి 300 మంది స్కాలర్లను ఎంపిక చేయగా.. వారిలో ఫైనలిస్టులు నిలిచారు. ఈ పోటీలో మొత్తం 18 లక్షల డాలర్లకు పైగా నగదు బహుమతులు ఉండగా.. మొదటి బహుమతి 2.5 లక్షల డాలర్లు.
వినూత్న ఆలోచనకు నాంది
చీమలను సాధారణంగా ఆహార అవశేషాలపై చేరే జీవులుగా మాత్రమే చూస్తాం. కానీ వాటి సహజ ఆహార వినియోగ సామర్థ్యాన్ని నియంత్రిత జీవ వ్యర్థ నిర్వహణ వ్యవస్థలో ఉపయోగించవచ్చా? అనే ప్రశ్నకు సమాధానం వెతకడమే అనన్య పరిశోధన ప్రత్యేకత. ప్రోటోటైప్ సాధించిన 83 శాతం సామర్థ్యం ఆహార వృథా సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం అని చెప్పలేకపోయినా.. సహజ జీవ ప్రక్రియలను ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలతో కలిపి ఉపయోగించే అవకాశాలపై పరిశోధనకు ఇది కొత్త దారి చూపిస్తోంది. నాలుగు రకాల చీమలను పరీక్షించడం నుంచి గణిత నమూనా రూపొందించడం, చివరకు పనిచేసే ప్రోటోటైప్ను తయారు చేయడం వరకు అనన్య సాగించిన ప్రయాణం.. పర్యావరణ సమస్యలకు యువత వినూత్నంగా ఆలోచిస్తే ఎలాంటి కొత్త పరిష్కారాలు వెలుగులోకి రావచ్చో చూపిస్తోంది.




