RBI: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..? ఛార్జీల విధింపునకు రంగం సిద్దం.. ఆర్బీఐ నుంచి అప్డేట్ వచ్చేసింది..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు రంగం సిద్దమైంది. త్వరనే దీనికి సంబంధించిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఆయన ఏమన్నారు అనేది చూద్దాం.

యూపీఐ ట్రాన్సాక్షన్లపై కేంద్రం ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రం ఆర్ధికశాఖ బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా వ్యాపారులకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించే అవకాశముంది. రూ.2 వేలు దాటి చేసే ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ చార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. దీని వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం వ్యాపారులకు మాత్రం ఛార్జీలు విధిస్తారు. గతంలోనూ ఈ ప్రతిపాదన తీసుకురాగా.. ఆ తర్వాత కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఎండీఆర్ ఛార్జీలపై మరో స్టెప్ ముందుకు వేసింది. దీంతో త్వరలోనే ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఆర్బీఐ గవర్నర్ రియాక్షన్ ఇదే..
అయితే ఈ ఛార్జీల విషయంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూద్దామన్న ఆయన.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా యూపీఐ నిర్వహణ, ఈ వ్యవస్థను నడిపేందుకు అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనిన తేల్చిచెప్పారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు అయ్యే ఖర్చును ఎవరో ఖర్చు భరించాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలో నేటితో ముగిశాయి. ఈ సందర్బంగా సంజయ్ మల్హోత్రా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో యూపీఐ ఛార్జీల విషయంపై స్పందించారు.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు
అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై పెద్ద వ్యాపారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధింపునకు సిద్దమైంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్లో కేంద్రం సవరణలు చేయనుంది. రూ.2 వేలుపైబడిన లావాదేవీలకు ఎండీఆర్ రేటు 0.3 శాతం నుంచి 0.5 శాతం మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఛార్జీలను ఇంకా కేంద్రం ఖరారు చేయలేదు. కేవలం పెద్ద వ్యాపారులకు మాత్రమే వీటిని విధించనున్నారు. దీని వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడదు. సామాన్యులు ఎప్పటిలాగే ఉచితంగా యూపీఐ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అయితే యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ చార్జీలను బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు భరిస్తున్నారు. ఇప్పటినుంచి వ్యాపారులు వీటిని భరించాల్సి ఉంటుంది. కేవలం అధిక టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ఛార్జీలు విధిస్తారు.
