వామ్మో.. బంగారం, వెండి ధరలు అంతలా పెరుగుతాయా.. బాంబ్ పేల్చిన రాబర్ట్ కియోసాకి
గత కొంతకాలంగా హెచ్చుతగ్గులతో ఇన్వెస్టర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పసిడి మార్కెట్ గురించి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా పసిడి, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రిచ్ డాడ్-పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి పెట్టుబడులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ సలహాను ఉటంకిస్తూ.. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల బంగారం, వెండి ధరల్లో భారీ క్షీణత నమోదైందని రాబర్ట్ కియోసాకి ఎక్స్లో పోస్ట్ చేశారు. బంగారం గతంలో ఉన్న గరిష్ట స్థాయి 5,405 డాలర్ల నుండి 4,006 డాలర్ల మార్క్కు పడిపోయింది. వెండి 118 డాలర్ల స్థాయి నుండి భారీగా క్షీణించి 56 డాలర్లకి చేరుకుంది. ధరలు తగ్గిన ఈ సమయాన్నే తను పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశంగా మార్చుకున్నట్లు కియోసాకి వెల్లడించారు. ‘‘ధరలు పడిపోయినప్పుడు నేను మరింత ఎక్కువగా బంగారం, వెండిని కొనుగోలు చేశాను” అని ఆయన వెల్లడించారు.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని కియోసాకి హెచ్చరించారు. అమితంగా పెరుగుతున్న గ్లోబల్ అప్పులు, ద్రవ్యోల్బణం, ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం కారణంగానే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు. తనకు సెంట్రల్ బ్యాంకులపై నమ్మకం లేదని, అందుకే విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టానని స్పష్టం చేశారు.
చాలా మంది చేసే తప్పు ఇదే..
‘‘సాధారణంగా ప్రజలు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం కొని, ధరలు తగ్గినప్పుడు భయంతో అమ్మేస్తుంటారు. మీరు కూడా అదే తప్పు చేయబోతున్నారా? లేదా తక్కువ ధరల్లో కొనుగోలు చేసి భవిష్యత్తు కోసం సంపదను సృష్టించుకుంటారా? ఆలోచించండి’’ అని కియోసాకి ఇన్వెస్టర్లకు హితబోధ చేశారు.
ఇన్వెస్టర్లకు గమనిక..
రాబోయే కాలంలో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని, అయితే ఈ ప్రయాణంలో మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కూడా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కాబట్టి దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
