RBI: మీ బ్యాంక్ అకౌంట్ను లాక్ చేసుకోవచ్చు.. త్వరలోనే అమలుకు ఆర్బీఐ రెడీ.. ఎలా పనిచేస్తుందంటే..?
సైబర్ నేరాలను అరికట్టే ప్రయత్నంలో ఆర్బీఐ నిమగ్నమైంది. ఇందుకోసం అనేక కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు నష్టపోయిన వారికి పరిహారం కూడా అందిస్తోంది. ఈ క్రమంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో పూర్తి వివరాలు చూద్దాం.

ప్రతీఒక్కరూ తమ ఫోన్ను ఇతరులు ఓపెన్ చేయకుండా లాక్ వేసుకుంటారు. ఫోన్ భద్రత, వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా సురక్షితంగా ఉండేందుకు ఇలా లాక్ వేసుకుంటారు. ఇలాంటి తరహా ఫీచర్ను త్వరలో ఆర్బీఐ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతంది. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరగకుండా అవసరమైనప్పుడు మీరు లాక్ చేసుకోవచ్చన్నమాట. దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు ఆర్ధికంగా నష్టపోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ ఫీచర్ తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. కిల్వ్ స్విచ్ పేరుతో ఈ సదుపాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. డిజిటల్ లావాదేవీల కోసం ‘కిల్ స్విచ్’ ఆప్షన్ తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ముందడుగు వేసింది.
ఎప్పుడైనా లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు
మే 29న ఆర్బీఐ వార్షిక నివేదిక విడుదల చేసింది. ఇందులో క్విల్ స్విచ్ ఫీచర్ గురించిన వివరాలను పొందుపర్చింది. కస్టమర్ తన బ్యాంక్ ఖాతా నుంచి ఏదైనా అనుమానాస్పద లావాదేవీ లేదా మోసం జరిగినట్లు అనుమానిస్తే.. వెంటనే బ్యాంక్ ఖాతా నుండి అన్ని విత్డ్రాయల్ లావాదేవీలను ఒకేసారి పూర్తిగా నిలిపివేయవచ్చు. సైబర్ మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్ల సమాచారాన్ని సేకరించి అందులోని డబ్బులను క్షణాల్లో మాయం చేస్తున్నారు. ఈ నష్టాన్ని నివారించడానికి ఆర్బీఐ చర్యలు చేపట్టింది. అందలో భాగంగానే అన్ని డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫారమ్లలో ‘స్విచ్ ఆన్’, ‘స్విచ్ ఆఫ్’ ఫీచర్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. మోసం జరిగిందని అనుమానం రాగానే మీరు ఈ ఆప్షన్లు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సదుపాయం డెబిట్, క్రెడిట్ కార్డులకు అందుబాటులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా తమకు అనుకూలమైన సమయంలో కార్డు లావాదేవీలను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చు.
ఈ ఏడాదిలో ఏఐ వ్యవస్థ
యూపీఐ లావాదేవీల విషయంలో ఆర్బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐలో కొత్త వ్యక్తికి రూ.10 వేలకుపైగా నగదు పంపేటప్పుడు గంట పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. గంట తర్వాతనే రిసీవర్ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ గంటలోపు అతడికి వెళ్లకుండా మీరు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఒకవేళ లావాదేవీ మోసపూరితంగా జరుగినప్పుడు.. అది పూర్తికాకముందే సిస్టమ్ ద్వారా నిరోధించవచ్చు. ఈ చిన్న జాప్యం పెద్ద మోసాలు జరగకముందే అడ్డుకుంటుంది. ఇక ఆర్బీఐ త్వరలో డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది పనిచేయనుంది. ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని ప్రతి డిజిటల్ లావాదేవీని నిజ సమయంలో పర్యవేక్షిస్తారు. ప్రతి లావాదేవీకి ఒక రిస్క్ స్కోర్ను కేటాయిస్తుంది. దీనివల్ల ఏవైనా సాంకేతిక లేదా ఆర్థిక అవకతవకలను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది.
