RBI: ఈఎంఐ కట్టలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక నుంచి ఇలా చేయడం కుదరదు..
ఆర్బీఐ లోన్ రికవరీ రూల్స్ను జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. లోన్ చెల్లించనివారికి రక్షణగా ఈ నిబంధనలు ఉన్నాయి. పదే పదే కాల్స్ చేయడం, బెదిరించడం వంటి వాటికి ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది.

లోన్ తీసుకుని ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు సదరు వ్యక్తిని డీఫాల్టర్గా పరిగణిస్తాయి. రోజూ కాల్ చేసి అడగడం, ఇంటికి రావడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే లోన్ చెల్లించకపోతే వేధించడం, బెదిరించడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ రికవరీ రూల్స్ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల్లో భాగంగా లోన్ చెల్లించకపోతే ఏ టైమ్లో కాల్ చేయాలి? ఇంటికి ఎప్పుడు వెళ్లవచ్చు..? అనే విషయంపై కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది. జనవరి 1,2027 నుంచి ఈ నియమాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనల వల్ల ఏయే మార్పులు రానున్నాయనే విషయం ఒకసారి తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రికవరీ నిబంధనలను జారీ చేసింది. బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలన్నీ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లోన్ రికవరీ చేసుకునేందుకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో కాకుండా వేరే సమయాల్లో కాల్ చేయడం నిబంధనలకు విరుద్దం. అలాగే ఇంటికి సందర్శించాలనుకున్నా ఈ సమయంలో మాత్రమే వెళ్లాలి. అయితే రుణం తీసుకున్న వ్యక్తి అనుమతిస్తే ఇతర సమయాల్లో కూడా సంప్రదించవచ్చు. ఇక హెల్త్ ఎమర్జెన్సీ, సంతాపం లేదా పెళ్లి వేడుక వంటి సమయాల్లో లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను సంప్రదించకూడదు. ఇక పదే పదే కాల్స్ చేసి వేధించడం, బహిరంగంగా అవమానించడం, కుటుంబసభ్యులను భయపెట్టడం లాంటివి చేయకూడదు.
ఇక కస్టమర్పై దూర్బాషలాడటం, బెదిరింపు బాష ఉపయోగించడం, వేధింపులకు పాల్పడటం, పదే పదే ఫోన్ కాల్స్ చేయడం వంటివి లోన్ రికవరీ ఏజెంట్లు చేయకూడదు. అయితే ఇంటిని సందర్శించాలనుకుంటే లోన్ రికవరీ ఏజెంట్లు కనీసం ఒక రోజు ముందుగా రుణగ్రహీతకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక కేసును నిర్వహిస్తున్న ఏజెన్సీ గురించిన సమాచారాన్ని బ్యాంక్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఇక లోన్ రికవరీ ఏజెంట్లు గుర్తింపు కార్డు, అధికార పత్రం, సంబంధిత రికవరీ నోటీసును వెంట ఉంచుకోవాలి. ఆ డాక్యుమెంట్లలో ఏజెన్సీ, రుణదాత ఫిర్యాదుల అధికారి సంప్రదింపు వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇక రుణగ్రహీతలను వారు ఎంచుకున్న ప్రదేశంలో సంప్రదించాలి. ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు లేదా అంగీకరించిన ప్రదేశానికి రుణగ్రహీత పదేపదే హాజరు కానప్పుడు ఇంటికి లేదా కార్యాలయానికి వెళ్లి కలవొచ్చని ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొంది. ఇక లోన్ రికవరీ కాల్స్ రికార్డులను భద్రపర్చాలి.
