Digital Payments: ఆన్లైన్ పేమెంట్స్ చేసేవారికి బిగ్ అలర్ట్.. దేశంలో మారనున్న రూల్స్.. మరికొద్ది రోజులే టైమ్
సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను తప్పనిసరి చేశారు. ఇక నుంచి ఆన్ లైన్ లావాదేవీలు చేయాలంటే రెండు రకాల వెరిఫికేషన్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఆన్లైన్ పేమెంట్స్కు మరింత భద్రతను కల్పించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్న క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్తో మీరు మరింత సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు పూర్తిగా మారనున్నాయి. ప్రతీఒక్కరినీ ప్రభావితం చేయనున్న ఈ రూల్స్ గురించి దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సిందే. ఇంతకు ఆన్ లైన్ లావాదేవీలకు ఏప్రిల్ నుంచి వస్తున్న కొత్త నియమాలు ఏంటి..? అనే వివరాలు చూద్దాం.
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్ చెల్లింపులకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అతిపెద్ద మార్పు రాబోతుంది. అదేంటంటే.. మీరు ఏదైనా డిజిటల్ లావాదేవీ చేయాలంటే ఏదైనా రెండు రకాల ధృవీకరణ ప్రక్రియలు పూర్తి చేయాలి. ఈ మేరకు బ్యాంకులు, కార్డ్ నెట్వర్క్లు, ఫిన్టెక్ సంస్థలకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్ వర్డ్, పాస్ ఫ్రేజ్లు లేదా పిన్లు, హార్డ్వేర్ టోకెన్, కార్డులు లేదా సాఫ్ట్వేర్ ఆధారిత వెరిఫికేషన్ టోకెన్లు, ఫింగర్ప్రింట్స్, ఫేషియల్ రికగ్నేషన్ వంటి రెండు రకాల వెరిఫికేషన్లు పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
నిబంధనలు ఇవే..
-అన్ని డిజిటల్ చెల్లింపులకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి
-రెండిటిలో ఒకటి డైనమిక్గా ఉండాలి.. మరొకటి ప్రత్యేకంగా రూపొందించాలి
-నిబంధనలు పాటించకపోవడం వల్ల మోసం జరిగితే బాధ్యత వహించాలి
-రిస్క్ బేస్డ్ లావాదేవీలకు అథెంటికేషన్కు ప్రత్యేక తనిఖీలు అవసరం
-అక్టోబర్ 1,2026 నుంచి క్రాస్ బార్డర్ లావాదేవీలకు కూడా అధెంటికేషన్ అవసరం
ఆర్బీఐ కొత్త రూల్స్ ఎందుకు..?
గత కొన్నేళ్లుగా యూపీఐ రాకతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీని వల్ల సైబర్ మోసాలు, అనధికార లావాదేవీల్లో కూడా పెరుగుదల నమోదైంది. సిమ్ స్వాప్లు, ఫిషింగ్, మాల్వేర్ దాడులకు సులభంగా గురయ్యే ఓటీపీలపై ఆధారపడకుండా ఈ కొత్త ఫ్రేమ్ వర్క్ బహుళ అంచెల భద్రతను కల్పిస్తుంది. ఇక ఈ టూ ఫ్యాక్టర్ వెరఫికేషన్ నియమాలను పాటించకపోవడం వల్ల ఒక లావాదేవీ మోసపూరితమైనదైతే బ్యాంకులు కస్టమర్లకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి. లావాదేవీలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడం, ప్రతి దశలోనూ నిబంధనల పాటింపును నిర్ధారించుకోవడం కోసం ఈ నిబంధనలను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అన్ని ఆర్ధిక సంస్థలు ఈ నిబంధనలను పాటించాలని ఆర్బీఐ ఆదేశించింది.
