UPI Rules: యూపీఐ ఆధారిత ఏటీఎంలు.. ఇక డెబిట్ కార్డులకు చెల్లుచీటి.. కోడ్ స్కాన్ చేస్తే చాలు..
యూపీఐ ద్వారా మొదటిసారి పేమెంట్ చేసి వ్యక్తికి రూ. 2000 మించి పంపాలనుకుంటే వెంటనే కాకుండా నాలుగు గంటలు సమయం పట్టే విధంగా కొత్త నిబంధనలు చేసింది. అంతేకాక ఏటీఎంల విషయంలో మరో కీలకమైన అడుగును ఆర్బీఐ వేసింది. ఇకపై యూపీఐ ఆధారిత ఏటీఎంలు కొలువుదీరనున్నాయి. అంటే ఏటీఎం కార్డు అవసరం లేకుండా సింపుల్ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డబ్బులు తీసుకొనే వెసులుబాటు అన్నమాట.

డిజిటల్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) కీలక భూమిక పోషిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో చాలా పెద్ద మార్పులకు ఇది నాంది పలికింది. వ్యక్తుల విద్యార్హతతో పనిలేకుండా పండితుల నుంచి పామరుల వరకూ విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ, వీధి చివర బడ్డీకొట్టు నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకూ ఈ యూపీఐ పేమెంట్లు వేగంగా విస్తరించాయి. ప్రజలకు వేగంగా, సులభంగా లావాదేవీలు నిర్వహించడంలో బాగా తోడ్పాటునందిస్తున్నాయి. ఈ క్రమంలో వీటి వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
అదే సమయంలో మోసాలు కూడా సులువుగా జరుగుతున్నాయి. కేవలం క్యూఆర్ కోడ్ ఉంటే చాలు లావాదేవీలు జరిగిపోతుండటంతో నేరగాళ్లు యూపీఐల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. దీనిని పరిహరించడంతో పాటు మరిన్ని మెరుగైన సేవలను వినియోగదారులకు అందించేందుకు యూపీఐలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). ఇందులో ప్రధానమైనది మొదటిసారి పేమెంట్ చేసి వ్యక్తికి రూ. 2000 మించి పంపాలనుకుంటే వెంటనే కాకుండా నాలుగు గంటలు సమయం పట్టే విధంగా కొత్త నిబంధనలు చేసింది. అంతేకాక ఏటీఎంల విషయంలో మరో కీలకమైన అడుగును ఆర్బీఐ వేసింది. ఇకపై యూపీఐ ఆధారిత ఏటీఎంలు కొలువుదీరనున్నాయి. అంటే ఏటీఎం కార్డు అవసరం లేకుండా సింపుల్ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డబ్బులు తీసుకొనే వెసులుబాటు అన్నమాట. ఇలాంటి పలు మార్పులు, కొత్త నిబంధనలు ఆర్బీఐ యూపీఐ సేవలకు పరిచయం చేసింది. ఇవి 2024, జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యాక్టివ్ లేకుంటే డిలీట్.. గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్ పారాల వినియోగదారులు తమ ఖాతాలను వెరిఫై చేసుకోవాలి. వారి యూపీఐ ఐడీలు యాక్టివ్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టివ్గా లేకపోతే ఆ యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) బ్యాంకులను కోరింది.
కొత్త ప్లాట్ ఫారం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మరో కొత్త ప్లాట్ ఫారం ను తీసుకొస్తోంది.యూపీఐ ఫర్ సెకండరీ మార్కెట్ పేరిట దీనిని లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం దీనిని బీటా వెర్షన్లో పరీక్షిస్తోంది. ఇది స్టేక్ హోల్డర్లకు ఉపకరించనుంది. క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా టీ1 ప్రాతిపదికన చెల్లింపులు ప్రాసెస్ అయిన వాటికి ఉపకరించనుంది.
పరిమితి పెంపు.. యూపీఐ లావాదేవీ గరిష్ట పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ. లక్ష ఉండగా.. విద్య, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం ఈ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది.
మారనున్న ఏటీఎంల రూపు.. ప్రస్తుతం ఏటీఎంలను డెబిట్ కార్డు ద్వారా మాత్రమే వినియోగించగలుగుతున్నాం. ఎస్బీఐ వంటి బ్యాంకులు కార్డ్ లెస్ క్యాష్ ను కూడా అందిస్తున్నాయి. అయితే ఇకపై డెబిట్ కార్డు లెస్ ఏటీఎంలు రానున్నాయి. ఫోన్లో యూపీఐ ఐడీని వినియోగించి లేదా.. ఏటీఎంలలో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి వైట్ లేబుల్ ఏటీఎం(డబ్ల్యూఎల్ఏ) అని పేరు పెట్టారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.
రూ. 2000లకు మించితే.. మీరు యూపీఐ నుంచి కొత్త వ్యక్తికి మొదటి సారి డబ్బులు పంపాలనుకుంటే మీకు వెంటనేలావాదేవీ పూర్తవదు. ఆ డబ్బు అవతలి వ్యక్తికి చేరడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..