AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు.. భారత్‌ పరిస్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వార్నింగ్‌!

రఘురామ్ రాజన్ హెచ్చరికల ప్రకారం, ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150-200 డాలర్ల వరకు చేరి, ద్రవ్యోల్బణాన్ని, వడ్డీ రేట్లను పెంచుతాయి. భారతదేశం వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఇది అత్యంత ప్రమాదకరం, రూపాయి విలువ క్షీణించి కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు.. భారత్‌ పరిస్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వార్నింగ్‌!
Raghuram Rajan
SN Pasha
|

Updated on: Mar 21, 2026 | 7:33 PM

Share

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందన్నదే ప్రపంచ ఆర్థిక గమ్యాన్ని నిర్ణయించే కీలక అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణ ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాలో 15 శాతం నుంచి 20 శాతం వరకు అంతరాయాన్ని కలిగించే స్థాయికి చేరుకుంది. కొన్ని దేశాలు తమ నిల్వలను వినియోగిస్తూ తాత్కాలికంగా పరిస్థితిని నియంత్రిస్తున్నప్పటికీ, యుద్ధం సుదీర్ఘంగా సాగితే ప్రభావం మరింత తీవ్రమవుతుందని ఆయన హెచ్చరించారు.

ఈ పరిస్థితుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇలాంటి ధరలు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరచే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే అనేక దేశాలు అధిక ధరల ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఇంధన ధరల పెరుగుదల వడ్డీ రేట్లను మరింత పెంచే పరిస్థితి తీసుకురావచ్చని రాజన్ వివరించారు.

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్‌ జలసంధి ప్రాంతం చుట్టూ ఉన్న ఉద్రిక్తతలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలు అధికంగా ప్రభావితమవుతాయని ఆయన తెలిపారు. భారతదేశం విషయానికి వస్తే దిగుమతి చేసుకునే ముడి చమురుపై అధిక ఆధారపడటం వల్ల ప్రత్యేకంగా ప్రమాదంలో ఉందని రాజన్ పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల కరెంట్ అకౌంట్ లోటును పెంచడంతో పాటు రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతుందని ఆయన హెచ్చరించారు. దీర్ఘకాలికంగా సబ్సిడీలతో వినియోగదారులను రక్షించడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు.

భవిష్యత్తు కోసం వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పెంచడం, ఇంధన వనరులను విభిన్నీకరించడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం అత్యవసరమని రాజన్ సూచించారు. ఈ సంక్షోభాన్ని ప్రపంచానికి ఒక హెచ్చరికగా భావించి, దేశాలు తమ ఆర్థిక వ్యూహాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చిచెప్పారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us