
ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో సామాన్యులకు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు. నిత్యావసరాల నుంచి మొదలు ఎలక్ట్రానిక్స్ వరకు రేట్లు తగ్గనున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఎయిర్ కండీషనర్ల తయారీదారులు, డీలర్లు అడ్వాన్స్ బుకింగ్లను ప్రారంభించారు. జీఎస్టీ తగ్గింపుతో ఏసీలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తూ.. ఈ ముందస్తు బుకింగ్ల ద్వారా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ కండీషనర్లపై 28శాతం జీఎస్టీ అమల్లో ఉంది. అయితే సెప్టెంబర్ 22 నుండి ఇది 18శాతానికి తగ్గనుంది. దీనివల్ల ఏసీ ధరలు గణనీయంగా తగ్గుతాయి. బ్లూ స్టార్, హైయర్ ఈ ధర తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించాయి. దీని ఫలితంగా ఒక్కో ఏసీపై మోడల్ను బట్టి రూ.4,000 వరకు ఆదా అవుతుందని కంపెనీలు చెబుతున్నాయి.
హైయర్ సంస్థ కేవలం రూ.1 చెల్లించి ఏసీలను ప్రీ-బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనితో పాటు ఎంపిక చేసిన చెల్లింపులపై 10శాతం వరకు క్యాష్బ్యాక్, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై ఉచిత ఇన్స్టాలేషన్, గ్యాస్ ఛార్జింగ్తో ఐదేళ్ల పూర్తి వారంటీ, సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. సెప్టెంబర్ 10 నుండి 21 వరకు ఈ బుకింగ్ విండో అందుబాటులో ఉంటుందని హైయర్ తెలిపింది. ఈ సంస్థ తమ 1.6-టన్నుల 5-స్టార్ ఏసీ ధరను రూ.3,905, అలాగే 1.0 టన్నుల 3-స్టార్ ఏసీ ధరను రూ.2,577 తగ్గించింది.
జూన్ త్రైమాసికంలో అకాల వర్షాల కారణంగా ఏసీ అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు ఈ ధర తగ్గడాన్ని అవకాశంగా మలుచుకునేందుకు కంపెనీలు చూస్తున్నాయి. సులభమైన ఫైనాన్స్, ఉచిత ఇన్స్టాలేషన్, వారంటీ పొడిగింపు, జీరో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. కస్టమర్లు నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. డీలర్లు అడ్వాన్స్ బుకింగ్లు తీసుకుంటున్నప్పటికీ, కొత్త జీఎస్టీ రేటు అమల్లోకి వచ్చే సెప్టెంబర్ 22న మాత్రమే బిల్లులు జారీ చేస్తారని ఆయన వివరించారు. ఈ జీఎస్టీ తగ్గింపుతో ఏసీ అమ్మకాలు ఊపందుకుంటాయని ఏసీ పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి