2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. Money9 సమ్మిట్లో సీఎం ఫడ్నవీస్ కీలక కామెంట్స్..
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే మహారాష్ట్ర.. ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమైంది. ముంబై వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన Money9 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సమ్మిట్ 2026 నాల్గవ ఎడిషన్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒక పటిష్టమైన భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించారు. 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యమన్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో Money9 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సమ్మిట్ 2026 నాలుగో ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వీడియో ద్వారా ప్రసంగిస్తూ.. రాష్ట్రం సాధిస్తున్న అద్భుతమైన ఆర్థిక వృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పారు. TV9 నెట్వర్క్ MD & CEO బరుణ్ దాస్ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం మొదలైంది. మహారాష్ట్ర నేడు కేవలం భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రం మాత్రమే కాదని, ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగిందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రను ఒక ప్రత్యేక దేశంగా పరిగణిస్తే, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో చోటు దక్కించుకుంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోందని ఫడ్నవీస్ వివరించారు.
అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్
మహారాష్ట్ర సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ, రాష్ట్రం ప్రస్తుతం పలు రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో మహారాష్ట్ర అగ్రభాగం దక్కించుకుంటోందని చెప్పారు. అత్యధిక సంఖ్యలో ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయన్నారు. స్టార్టప్, కొత్త ఉద్యోగాల సృష్టిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఫడ్నవీస్ నొక్కి చెప్పారు.
వికేంద్రీకరణతో జిల్లాల అభివృద్ధి
ఒకప్పుడు అభివృద్ధి అంటే కేవలం ముంబై, పూణేలకే పరిమితమనే భావన ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఫడ్నవీస్ అన్నారు. ‘‘గడ్చిరోలి, నందూర్బార్, జల్గావ్, నాందేడ్ వంటి వెనుకబడిన జిల్లాల్లో కూడా నేడు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ కొత్త వ్యాపార అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని సీఎం తెలిపారు.
5 ట్రిలియన్ డాలర్ల స్వప్నం..
భారతదేశాన్ని 2047 నాటికి వికసిత భారత్గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా, మహారాష్ట్ర తన వంతుగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ముందుకెళ్తోందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం మూడు దశల అభివృద్ధి దార్శనికతను రూపొందించిందని, దీని ద్వారా రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Money9 వేదిక ద్వారా ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించడం అభినందనీయమని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సమ్మిట్ రాష్ట్ర ఆర్థిక పురోగతికి మరింత ఊతాన్నిస్తుందని ఫడ్నవీస్ తెలిపారు.
