Indian Railways: రైలు ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారా..? మీ ఫోన్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు.. నిమిషాల్లోనే పరిష్కారం..
రైల్వే ఫిర్యాదుల వ్యవస్థలో సమూల మార్పులకు ఇండియన్ రైల్వే శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి వేగవంతంగా ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటినుంచి ఫిర్యాదులకు ఓటీపీ అవసరం లేదు. అంతేకాకుండా కోచ్లను సలభంగా గుర్తించే క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని రైల్వేశాఖ అనుసరించనుంది.

రైల్లో ప్రయాణించే సమయంలో ఏదైనా సమస్య ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు సౌకర్యాలపై ఎలాంటి సమస్య ఉన్నా రైల్వేశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. మీ మొబైల్ నుంచే ఆన్లైన్ ద్వారా రైల్వే అధికారులకు కంప్లైంట్ చేసే సదుపాయం ఉంది. ఇందుకోసం రైల్ మదద్ అనే యాప్ను రైల్వేశాఖ అందుబాటులో ఉంచిది. ఈ యాప్ ద్వారా ట్రైన్లలో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైనా ఫిర్యాదు చేయవచ్చు. రైలు బోగీల్లో నీటి కొరత ఉన్నా, శుభ్రంగా లేకపోయినా, ఆహారం బాలేకపోయినా.. ఇలాంటి అన్ని సమస్యలపై కంప్లైంట్ చేయవచ్చు. అయితే రైల్ మదద్ యాప్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సమస్యలు సులభంగా పరిష్కరించేందుకు ఫ్లాట్ఫామ్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
ఫిర్యాదుల వ్యవస్థలో కీలక మార్పులు
ఫిర్యాదుల వ్యవస్థలో రైల్వేశాఖ మార్పులకు నాంది పలికింది. ఇక నుంచి ప్రాంతం, సమస్యను బట్టి ఏ టీమ్ పరిష్కరించాలనేది ప్రత్యేకంగా నిర్ణయిస్తారు. దీని వల్ల అనవసరపు జోక్యం తగ్గుతుంది. ఇక రైళ్లలోని సమస్యలు, స్టేషన్లలోని సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను వేర్వేరుగా పర్యవేక్షిస్తారు. సమస్య ఏ విభాగానికి చెందినది అయితే ఆయా విభాగానికి మాత్రమే పంపుతారు. ఉదాహరణకు ట్రైన్ కోచ్లో నీటి కొరత ఉండి ప్రయాణికుడు ఫిర్యాదు చేసినప్పుడు.. నీటి సౌకర్యం అందుబాటులో ఉన్న తర్వాతి స్టేషన్కు ఫిర్యాదు బదిలీ చేస్తారు. దీంతో అక్కడి బృందం ముందుగానే సమస్యను తెలుసుకుని రైలు కోసం ఎదురుచూస్తుంది. రైలు రాగానే సమస్యను వేగంగా పరిష్కరిస్తుంది. ఇక ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత క్యాటరింగ్ ఏజెన్సీ, ఐఆర్సీటీసీకి పంపుతారు.
ఓటీపీ అవసరం లేదు..
ఫిర్యాదును ముగించే ముందు ఓటీపీ అవసరాన్ని తగ్గించనుంది. ప్రయాణంలో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేనప్పుడు ఓటీపీని అందుకోవడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఓటీపీ విధానాన్ని తొలగించనుంది. ఇక ఫిర్యాదుల ధృవీకరణను బలోపేతం చేయడానికి కోచ్ల లోపల పీఎన్ఆర్ ఆధారిత తనిఖీలు, క్యూఆర్ కోడ్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేస్తున్న ప్రదేశాన్ని నిర్ధారిస్తాయి. ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేసినప్పుడు కోచ్లను గుర్తించేందుకు క్యూఆర్ స్కానింగ్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అలాగే ఒక పీఎన్ఆర్ ద్వారా పలు ఫిర్యాదు చేసే సందర్భాన్ని పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుంది. మెరుగైన ధృవీకరణ, నిజమైన ప్రయాణీకుల సమస్యలను పునరావృతమయ్యే లేదా స్పామ్ ఫిర్యాదుల నుండి వేరు చేయడానికి ఇది సహాయపడుతుంది. త్వరలో ఈ ఐదు మార్పులను రైల్ మదద్ యాప్లో తీసుకురానున్నాయి. దీంతో ప్రయాణికుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది.
