Bullet Train: హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైల్ కారిడార్.. పనులు మరింత షురూ.. ఈ మార్గంలో మార్కింగ్..
హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ ట్రైన్ల ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిల్లో హైదరాబాాద్-ముంబై కారిడార్ పనులు షురూ అయ్యాయి. ఈ మేరకు ప్రాజెక్ట్ మార్గంలో అధికారులు మార్కింగ్ వేసే ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వం హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లపై స్పీడ్ పెంచింది. అహ్మదాబాద్-ముంబై కారిడార్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తి కావొచ్చాయి. వచ్చే ఏడాదిలో ఈ మార్గంలో దేశంలోనే తొలి బుల్లెట్ రైలును నడపనున్నట్లు కేంద్రం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2027 ఆగస్ట్ 15న తొలి రైలు పరుగులు తీయనుంది. అయితే హైదరాబాద్ బుల్లెట్ రైళ్లకు పెద్ద హబ్గా మారనుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించనున్నారు. నగరం నుంచి ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణెకు కనెక్టివిటీ కల్పిస్తూ ఈ కారిడార్లకు రూపకల్పన చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి ఈ మూడు కారిడార్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బుల్లెట్ రైళ్ల నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం శంషాబాద్లో పెద్ద టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటి కోసం శంషాబాద్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాలను కేటాయించింది. దీంతో అధికారులు పనులను షురూ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
హైదరాబాద్-ముంబై కారిడార్పై అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైలు కారిడార్పై మరో అప్టేట్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బహదూర్ గూడ వద్ద ప్రారంభం కానున్న ఈ కారిడార్.. మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా ముంబై వరకు ఉండనుంది. ఈ కారిడార్ మార్గం కోసం అధికారులు తాజాగా మార్కింగ్ వేస్తున్నారు. ఎక్కువగా వ్యవసాయ పొలాల నుంచే ఈ మార్గం వెళుతుండగా.. పొలాల్లో అధికారులు మార్కింగ్ వేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ భూములు కోల్పోతామనే భయం వారిని వెంటాడుతుంది. శంషాబాద్ మంలంలోని చౌదరిగూడ, సుల్తాన్పల్లి, కేబీదొడ్డి గ్రామాలతో పాటు మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్, సురంగల్, కేతిరెడ్డిపల్లి కూడళ్లల్లో మార్కింగ్లు వేశారు. ప్రతీ 5 కిలోమీటర్లకు ఒకచోట ఎలాంటి వంకరలు లేకుండా వేస్తున్నారు. నాలుగు వరుసల్లో బుల్లెట్ ట్రైన్ల కోసం కారిడార్ నిర్మించనుండగా.. రెండువైపులా సర్వీస్ రోడ్లను కూడా నిర్మించున్నారు. దీంతో 300 అడుగుల వెడల్పుతో భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మార్కింగ్లు వేస్తున్న అధికారులు
శంషాబాద్-ముంబై మార్గం కోసం ప్రస్తుతం మార్కింగ్లు వేస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు ప్రతిపాదించిన బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇక హైదరాబాద్-బెంగళూరు కారిడార్ పనులు కూడా మొదలుకావాల్సి ఉంది. ఈ మూడు కారిడార్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ స్వరూపమే మారనుంది. రెండున్నర గంటల్లోనే నగరం నుంచి బెంగళూరు, చెన్నై, పుణె లాంటి నగరాలకు చేరుకోవచ్చు.
