
భారతీయులకు బంగారంతో విడదీయలేని అనుబంధం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు లేదా వారసత్వంగా వచ్చే ఆభరణాలను దాచుకోవడం మనకు అలవాటు. అయితే ఆదాయపు పన్ను సోదాల సమయంలో మీ వద్ద ఉన్న బంగారానికి లెక్క చూపలేకపోతే ఇబ్బందులు తప్పవు. అసలు ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండవచ్చు? చట్టం ఏం చెబుతోంది? అనేదానిపై అందరికీ అవగాహన ఉండాలి. మన దేశంలో మీరు మీ చట్టబద్ధమైన ఆదాయం ద్వారా ఎంత బంగారాన్నైనా కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. కానీ మీ ఆదాయానికి మించి బంగారం ఉన్నప్పుడు, దానికి సంబంధించిన రికార్డులు లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ మార్గదర్శకాల ప్రకారం.. ఎక్కువ బంగారం ఉంటే జప్తు చేస్తారు.
ఈ పరిమితులలోపు బంగారం ఉంటే, దానికి సంబంధించిన బిల్లులు వెంటనే చూపలేకపోయినా అధికారులు దానిని స్వాధీనం చేసుకోరు.
ఒకవేళ మీ వద్ద పరిమితి కంటే ఎక్కువ బంగారం ఉంటే, అది ఎక్కడి నుండి వచ్చిందో నిరూపించాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. అది మీ పాత ఆదాయంతో కొన్నదా..? లేదా వారసత్వంగా వచ్చిందా? అన్నది పత్రాల ద్వారా నిరూపించాలి. పరిమితి లోపు ఉన్నప్పటికీ, మీ ఆదాయ వనరులకు, ఆ బంగారానికి పొంతన లేదని అధికారులు భావిస్తే వివరణ అడగవచ్చు.
బంగారం విషయంలో దాని పరిమాణం కంటే, దాని అది ఎలా వచ్చింది అని నిరూపించడమే అత్యంత కీలకం. ఇందుకోసం కొన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవడం మంచిది.
కొనుగోలు బిల్లులు: నగలు కొన్నప్పుడు ఇచ్చే ఒరిజినల్ బిల్లులు.
వారసత్వ పత్రాలు: వీలునామా లేదా గిఫ్ట్ డీడ్ వంటివి.
బ్యాంకు స్టేట్మెంట్లు: నగదు ఉపసంహరణ లేదా డిజిటల్ చెల్లింపుల రికార్డులు.
వాల్యూయర్ రిపోర్ట్: బిల్లులు లేని పక్షంలో రిజిస్టర్డ్ వాల్యూయర్ ద్వారా తీసుకున్న నివేదిక.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి:
నగదు పరిమితి: రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన బంగారాన్ని పూర్తిగా నగదు రూపంలో కొనకూడదు.
పాన్ కార్డు: భారీ కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు తప్పనిసరి.
KYC: నగల వ్యాపారులు కచ్చితంగా కేవైసీ నిబంధనలు పాటించాలి.
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో, మీ వద్ద ఉన్న బంగారానికి సంబంధించిన రికార్డులను పక్కాగా ఉంచుకోవడం భవిష్యత్తులో ఐటీ చిక్కులు రాకుండా కాపాడుతుంది.