Budget 2024: పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..

|

Jul 23, 2024 | 11:07 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మోదీ త్రీ పాయిట్‌ ఓ సర్కారులో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్‌ ఇది. మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న ఏడో బడ్జెట్‌. 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ ఐదు పూర్తి బడ్జెట్లు..

Budget 2024: పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
Budget 2024
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మోదీ త్రీ పాయిట్‌ ఓ సర్కారులో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్‌ ఇది. మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న ఏడో బడ్జెట్‌. 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లు అత్యధిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డు ఆయన పేరు మీదే ఉంది. తాజా బడ్జెట్‌తో ఆ రికార్డును నిర్మలా సీతారామన్‌ అధిగమించబోతున్నారు. ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళ నిర్మల. ప్రధాని హోదాలో ఉంటూ నాడు ఇందిరా గాంధీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రి మాత్రం నిర్మలనే.

బడ్జెట్‌ ప్రవేశపెట్టడంలోనూ నిర్మల సీతారామన్‌ కొత్త పోకడలు తీసుకొచ్చారు. సంప్రదాయ బ్రీఫ్‌కేస్‌ విధానానికి ఆమె మంగళం పాడారు. జాతీయ చిహ్నంతో కూడిన ఖాతా పుస్తకం తరహాలో ఉండే బ్యాగులో ఆమె బడ్జెట్‌ పత్రాలు తీసుకొచ్చే సంప్రదాయానికి ఆమె శ్రీకారం చుట్టారు. 2019లో తొలి బడ్జెట్‌ నుంచి ఆమె ఖాతా బుక్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఇప్పటి వరకు అతి సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం రికార్డు, అతి స్వల్ప ప్రసంగం రికార్డు కూడా నిర్మలా సీతారామన్‌ పేరిటే ఉన్నాయి. 2020లో ఆమె చేసిన బడ్జెట్‌ ప్రసంగం రెండు గంటల 40 నిమిషాలు సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ఆమె చేసిన 57 నిమిషాల ప్రసంగం ఇప్పటి వరకు చేసిన ప్రసంగాల్లో అత్యల్పమైనది.

మోదీ 3.oలో మొత్తం ఐదేళ్ల కాలానికి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ కొనసాగితే అది కూడా ఒక రికార్డవుతుంది. బడ్జెట్‌ సమర్పణలో రకరకాల సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నారు. ఇప్పటి వరకు ఆమె ప్రవేశపెట్టినన్ని బడ్జెట్లు మరెవరకూ ప్రవేశపెట్టలేదు.

అయితే ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. గత ఫిబ్రవరిలో వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసి ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించారు.

ప్రధానుల బడ్జెట్

దేశంలో ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ను సమర్పిస్తారు. అయితే, వివిధ కారణాల వల్ల ప్రధానులు కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు.

ముంద్రా కుంభకోణం ఆరోపణల తర్వాత 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి డిడి కృష్ణమాచారి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామా చేయడంతో అప్పటి ప్రధాని నెహ్రూ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాలు, అణు ఇంధన శాఖలను నిర్వహించిన నెహ్రూ 1958 ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతతో బడ్జెట్‌ను సమర్పించారు.

మొరార్జీ దేశాయ్

నెహ్రూ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాక, 1967-68 నుండి 1969-70 వరకు ప్రతి సంవత్సరం పూర్తి బడ్జెట్, 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తర్వాత 1970లో ప్రధానిగా ఉన్న నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. 1969లో మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఇందిరా గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. ఇందిరా గాంధీ తన హయాంలో రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రాజీవ్ గాంధీ బడ్జెట్‌

1987-89లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1987లో ఆర్థిక మంత్రిగా వీపీ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీకి సన్నిహితులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో వి.పి. సింగ్ ఆ కేసుల దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

ప్రధాని మన్మోహన్ సింగ్

బి.వి. నరసింహారావు హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ 1991 నుండి 1996 వరకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. 1991 నాటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా బడ్జెట్ రూపొందించబడింది. మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొత్త బాట పట్టింది. భారతదేశ చరిత్రలో 1991 ఒక అపురూపమైన రోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


ఇది కూడా చదవండి: Indian Railways: రైలు లీటర్‌ డీజిల్‌కు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా?

ఇది కూడా చదవండి:Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏయే దేశాల్లో అనుమతి ఉంటుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి